ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి
హైదరాబాద్: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam prabhakar) పేర్కొన్నారు. శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని మంత్రి ప్రార్థించారు. ఆర్టీసీ కార్మికులు(RTC Workers Strike) ఆందోళన చెందవద్దని క్షణికావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలు జరుపుతుందని సూచించారు.
ఆర్టీసీ కార్మికులు అధైర్యపడవద్దన్న మంత్రి పొన్నం కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చలు జరుపుతోందని తెలిపారు. కార్మికులు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు తెలుపుకోవాలని, ఆవేశంలో ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని మరోసారి విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు నిరసనలకు మద్దతు ఇవ్వడం వల్ల అభ్యంతరం లేదన్న ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు సరికాదని సూచించారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే ఇలాంటి ఘోరమైన ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. నేతలు కూడా సంయమనం పాటించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.






