19-05-2025 04:02:25 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు, ఫైర్ ఇంజన్ లో నీళ్లు ఉంటే గుల్జార్ హౌజ్ అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం తగ్గేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ, ఇలాంటి మౌలిక సదుపాయల కల్పనపై పెడితే బాగుంటుంది. 125 ఏళ్ల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలో 17 మంది చనిపోవడం హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరమని కేటీఆర్ వాపోయ్యారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు పరిహారం ప్రకటించినప్పటికీ రూ.25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... నిన్నటి గుల్జార్ హౌజ్ లో అగ్నిప్రమాద సంఘటన హైదరాబాద్ చరిత్రలోనే విషాదకరమన్నారు. గుల్జార్ హౌస్ గురించి తెలియని వాళ్లు హైదరాబాద్, తెలంగాణలో ఎవరూ లేరని, 125 ఏళ్ల నుంచి చార్మినార్ దగ్గర ఉంటున్న అగర్వాల్ కుటుంబంలోని 17 మంది చనిపోవడం మనసున్న ప్రతీ ఒక్కరిని కలిచివేసిందన్నారు. బాధిత కుటుంబసభ్యులు ఎవరినీ నిందించడం లేదు. కానీ వారు కొన్ని విషయాలు చెప్పారని వ్యాఖ్యానించారు. ఫైర్ బ్రిగేడు నీళ్లు లేకుండా వచ్చిందని, ఫైర్ బ్రిగేడ్ వాళ్లు సరైన మాస్కులు లేకుండా రావడంతో లోపలికి వెళ్లలేకపోయారని ఆరోపించారు. అంబులెన్స్ లలో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, మాస్కులు లేకపోవడం దారుణమని మండిపడ్డారు.
ఈ కనీస సదుపాయలు ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ లో ఉంటే కొన్ని ప్రాణాలైన బతికేవని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. అగ్నిప్రమాదం జరగగానే స్థానికులైన హిందువులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో వచ్చి మమ్మల్ని కాపాడారని చెప్పినట్లు ఆయన వివరించారు. మాకు జరిగిన నష్టం రాబోయే రోజుల్లో ఎవరికీ జరగకుండా, ఎవరు చనిపోకుండా చూడమని కోరారు. ఇక్కడికి తాను రాజకీయం చేయడానికి రాలేదని, ఎవరినీ విమర్శించడం లేదు. కాని ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ శాఖ మంత్రి ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణ, ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల మీద రివ్యూ సమావేశం పెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
పాతబస్తీ అత్యధిక జనసాంద్రత ఉన్న ప్రదేశం అని, ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు, అంబులెన్స్ లు రావడానికి కూడా వీలుకాలేదన్నారు. అధికారులకు నిరంతరం ట్రైనింగ్ ఇవ్వాలని, తరుచుగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలి. ఇవేవి జరగలేదు కాబట్టే ఎనిమిది మంది చిన్నారులు తమ కళ్లముందే చనిపోయారని చెపుతున్నారని చెప్పారు.ప్రాణాలు పోయిన తర్వాత నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా చూడండని సూచించారు. అందాల పోటీల మీద పెట్టిన శ్రద్ధ ఇలాంటి వాటిపై కూడా పెట్టాలని, అందాల పోటీలపై పెట్టే ఖర్చు ఇలాంటి సందర్భాల్లో ఉండాల్సిన మౌలిక సదుపాయలపై పెట్టండని వ్యంగ్యంగా మాట్లాడారు.
రేవంత్ రెడ్డి దగ్గరనే హోం, మున్సిపల్ శాఖలు ఉన్నాయని, సంఘటన స్థలం దగ్గరికి రేవంత్ రెడ్డి వస్తే బాగుండేదన్నారు. ఐదు లక్షల నష్టపరిహారం సరిపోదు. ఇంటికి, వ్యాపారానికి తీవ్ర నష్టం జరిగింది. 125 సంవత్సరాల నుంచి హైదరాబాద్ లో ఉంటున్న అగర్వాల్ కుటుంబం మళ్లీ తమ వ్యాపారం ప్రారంభించుకోడానికి ప్రభుత్వం సహకరించాలి. రూ.25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరపున కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తామని, రాజకీయం చేయడానికి రాలేదు.. ఇలాంటి కడుపు కోత ఇంకెవరికి రాకూడదని వచ్చాను. ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని కేటీఆర్ కోరారు.