13-11-2025 12:40:12 AM
భారీగా నగదు, నకిలీ బంగారు నాణేలు, తాయత్తులు స్వాధీనం.
మోసకారులపై బాధితులు ముందుకు రావాలి: ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
నాగర్ కర్నూల్ నవంబర్ 12 (విజయక్రాంతి): అమాయకులను ఆసరాగా చేసుకొని తమ వద్ద మంత్ర శక్తులు ఉన్నాయని ఆరోగ్య పరిస్థితిని బాగు చేసేందుకు, గుప్త నిధులను బయటకు తీస్తామని నమ్మించి లక్షలు కాజేసిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 7.50 లక్షల నగదు, 1160 నకిలీ బంగారు నాణేలు, తాయత్తులను స్వాధీనం చేసుకున్నారు.
బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ వివరాలను వెల్లడించారు. తాడూరు మండలం అంతారం గ్రామానికి చెందిన కోట్ల అలివేల నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కాలనీలో నివాసం అంటుంది. గత కొంతకాలంగా తన వద్ద దైవ శక్తి మంత్ర శక్తులున్నాయని ప్రజలను నమ్మిస్తూ బురిడీ కొట్టిస్తుండేది.
ఆమెకు తోడుగా వికారాబాద్ జిల్లా ప్రాంతానికి చెందిన అతేల్లి అనితతో గత ఆరు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఇరువురు కలిసి గుప్తనిధులు బయట తీసేందుకు తమ వద్ద మంత్ర శక్తులు ఉన్నాయని జనాన్ని మోసగిస్తూ వస్తున్నారు. పంట పొలాల్లో ఇళ్ల స్థలాల్లో గుప్తనిధులు ఉండడం వల్లే తమ ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటుందని వాటిని పూజ చేసి బయట పెడతామంటూ నకిలీ బంగారు నాణాలను ముందుగానే ఏర్పాటు చేసి తర్వాత పూజలో బయట తీసినట్లుగా అందర్నీ నమ్మిస్తూ కోట్లు కొల్లగొట్టారు. ఈ క్రమంలో బాధితులు మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు దాడి చేసి ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వారి బారిన పడి మోసపోయిన బాధితులు నేరుగా ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేయవచ్చునని వారిపై కఠినంగా వ్యవహారిస్తామన్నారు. జిల్లాలోని ఆయా ఆసుపత్రి పరిసరాల్లో, ప్రధాన పట్టణ కేంద్రాల్లో తాయత్తులు మంత్రాలంటూ ప్రజలను మోసగించేందుకు బోర్డులు ఏర్పాటు చేసుకున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పి వెంకటేశ్వర్లు, డిఎస్పి బుర్రి శ్రీనివాసులు, సిఐ అశోక్ రెడ్డి, ఎస్త్స్ర గోవర్ధన్, పోలీస్ కానిస్టేబుళ్లు భీముడు, వెంకటేష్ రమేష్ తదితరులు ఉన్నారు.