31-05-2025 03:08:53 AM
లండన్లో కేటీఆర్
హైదరాబాద్, మే 30 (విజయక్రాంతి): తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 8 వేలకు పైగా అనుమతులు, రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఫలితంగా లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చాయని పేర్కొన్నారు. లండన్లో జరుగుతున్న బ్రిడ్జ్ ఇండియా వీక్-2025 సదస్సులో కేటీఆర్ మాట్లాడారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కేంద్రంగా సాగిన పాలన, ఆలోచనలు అద్భుత ఆవిష్కరణలుగా మారిన విధానంతో పాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కేటీఆర్ వివరించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా నిలిచిందని తెలిపారు. హైదరాబాద్లో టాప్ 5 మల్టీనేషనల్ కంపెనీల అతిపెద్ద క్యాంపస్లు నెలకొల్పాయని, టీఎస్ ఐపాస్తో సెల్ఫ్ సర్టిఫికేషన్ విధానం ప్రవేశపెట్టామని తెలిపారు. కేసీఆర్ తీసుకొచ్చిన టీఎస్ ఐపాస్తో పెట్టుబడులను భారీగా ఆకర్షించినట్లు వెల్లడించారు. దేశంలోని ఏ రాష్ర్టంలోనూ ఇలాంటి విప్లవాత్మక విధానం లేదన్నారు. మినిమమ్ గవర్నమెంట్-మ్యాగ్జిమమ్ గవర్నెన్స్ తమ విధానమనివిధానమని, తెలంగాణలో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు అందించామని కేటీఆర్ గుర్తు చేశారు.