నేర పరిశోధనకు లాల్జీ జీవం
నేడు లాల్జీ సింగ్ జయంతి :
న్యాయవ్యవస్థలో సత్యాన్వేషణ ఎప్పుడూ సులభం కాదు. ప్రత్యక్ష సాక్షులు మాట మార్చవచ్చు. నిందితులు ఒత్తిడితో నేరాన్ని ఒప్పుకోవచ్చు. పరిస్థితుల ఆధారాలు తప్పుదారి పట్టించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో నిజాన్ని వెలికితీసే శాస్త్రీయ ఆధారం కోసం ప్రపంచం ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూసింది. ఆ అవసరానికి సమాధానంగా వచ్చిన సాంకేతిక విప్లవమే డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్.
నేర పరిశోధనల నుంచి న్యాయస్థానాల వరకు సాక్ష్యాల విలువను పూర్తిగా మార్చేసిన ఈ సాంకేతికత, ఆధునిక న్యాయవ్యవస్థలో అత్యంత విశ్వసనీయ సాక్షిగా నిలిచింది. 1984లో బ్రిటన్కు చెందిన జన్యు శాస్త్రవేత్త సర్ అలెక్ జెఫ్రీస్ ఈ సాంకేతికతను కనుగొనడం ఫోరెన్సిక్ శాస్త్ర చరిత్రలో ఒక మలుపు. వ్యక్తుల మధ్య జన్యు భేదాలను అధ్యయనం చేస్తూ ఆయన చేసిన ఆవిష్కరణ, కొద్దికాలానికే హత్య కేసులను ఛేదించే అత్యంత శక్తివంతమైన ఆయుధంగా మారింది.
భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ లాల్జీ సింగ్ దేశీయ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ సాంకేతికతను అభివృద్ధి చేసి, భారత్ను ఈ రంగంలో స్వావలంబన దిశగా నడిపించారు. హైదరాబాద్లోని సీసీఎంబీలో ఆయన చేసిన పరిశోధనలు, అనంతరం ఏర్పడిన సీడీఎఫ్డీ దేశంలో ఫోరెన్సిక్ డీఎన్ఏ పరిశోధనలకు కేంద్రబిందువుగా మారాయి. డీఎన్ఏ పరిశోధనల్లో భారతదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసిన లాల్జీ సింగ్ 1947 జూలై 5న జన్మించారు.
కాగా, రాజీవ్గాంధీ హత్య నుంచి ప్రియదర్శిని మట్టూ కేసు వరకు అనేక సంచలన కేసుల్లో డీఎన్ఏ సాక్ష్యాలు న్యాయనిర్ణయంలో కీలకపాత్ర పోషించాయి. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లేదా డీఎన్ఏ ప్రొఫైలింగ్ అనేది వ్యక్తి డీఎన్ఏలోని ప్రత్యేక జన్యుక్రమాలను విశ్లేషించి అతని గుర్తింపును నిర్ధారించే శాస్త్రీయ పద్ధతి. ప్రతి మనిషి డీఎన్ఏ ప్రత్యేకంగా ఉంటుంది.
అందుకే నేర దర్యాప్తులు, పితృత్వ వివాదాలు, మృతదేహాల గుర్తింపు, అదృశ్యమైన పిల్లల ఆచూకీ వం టి అనేక రంగాల్లో ఈ సాంకేతికత అనివార్యమైంది. డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ నేరస్థులను పట్టుకునే సాంకేతికత మాత్రమే కాదు; నిర్దోషులను రక్షించే న్యాయ సాధనం కూడా.
కింజరాపు అమరావతి






