calender_icon.png 28 December, 2025 | 1:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తార్నాక ప్రభుత్వ పాఠశాలకు భూమి కేటాయించాలి

28-12-2025 12:00:00 AM

డిప్యూటీ మేయర్ వినతి

సికింద్రాబాద్, డిసెంబర్ 27 (విజయ్‌క్రాంతి) : తార్నాకలోని విజయ డెయిరీ కార్పొరేషన్ ప్రాంగణంలో కొనసాగుతున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సమస్యపై గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ను ఆమె కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించా రు. విజయ డెయిరీ కార్పొరేషన్ పాఠశాలకు ఖాళీ చేయాలంటూ నోటీసు జారీ చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందని డిప్యూటీ మేయర్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ పాఠశాల చింతల్ బస్తీ, ఎర్రకుంట, బాబా నగర్, హనుమాన్ నగర్, గోకుల్ నగర్ బస్తీ, ఆర్య వాటిక వంటి పరిసర ప్రాంతాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలకు ఏకైక విద్యా కేంద్రంగా ఉందని తెలిపారు.

పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటంతో విద్యార్థుల భద్రతకు ముప్పు ఏర్పడిందని, చిన్న గదులు, మౌలిక వసతుల లేమి, పరిశుభ్రత లోపంతో పాటు పాము ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని వివరించారు. ఈ పరిస్థితుల కారణం గా విద్యార్థుల సంఖ్య 450 నుంచి 100కు తగ్గిందని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం మధ్యలో పాఠశాల ఖాళీ చేయడం విద్యార్థుల చదువుకు తీవ్ర అంతరాయం కలిగి స్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

తక్షణమే ప్రస్తుత భవనానికి గడువు పొడిగించడంతో పాటు, టార్నాకాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి శాశ్వత భూమి కేటాయించాలని కలెక్టర్ను డిప్యూటీ మేయర్ కోరారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని విజ్ఞప్తి చేశారు.