06-10-2025 05:58:15 PM
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ ప్రవేశపెట్టిన మాదకద్రవ్యాల అవగాహన, వెల్నెస్ నావిగేషన్ పథకంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే వెంకటేష్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో న్యాయ సహాయ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ మాదకద్రవ్యాల బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి న్యాయసహాయమైన అందించడానికి ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా న్యాయ సహాయ కేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఇట్టి న్యాయ సహాయ కేంద్రంలో ఎటువంటి న్యాయ సలహా అయినా లేదా న్యాయ సహాయమైనా అందించడానికి ఒక న్యాయవాదిని, ఒక పారా లీగల్ వాలంటీర్ ను నియమించినట్లు తెలిపారు. మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని, మద్యానికి బానిసలై జీవితాలను పాడు చేసుకోవద్దని ఆసుపత్రికి వచ్చిన రోగులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ పర్యవేక్షణ అధికారి వీరారెడ్డి, లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ తనకు మహేష్, మానసిక రోగుల విభాగ అధిపతి అజయ్ కుమార్, ఇతర వైద్యులు పాల్గొన్నారు.