31-05-2025 06:15:22 PM
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు పిలుపు..
నమోదు కొరకు ప్రచార జాతా
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి రాజు(TS UTF State Secretary B Raju) పిలుపునిచ్చారు. శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు టీఎస్ యుటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార జాతా శనివారం పాల్వంచ, కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్, బస్టాండ్, పోస్ట్ ఆఫీస్ సెంటర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో కరపత్రాలను పంపిణీ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తల్లిదండ్రులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం ఉన్నాయని తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైనే ఉందన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,నోటు పుస్తకాలు, వర్క్ బుక్కులు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడుతున్నాయని, నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు, రాగిజావ అందిస్తున్నారని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి, ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలన్నారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడుతాయని తెలియజేశారు. ఈ ప్రచార జాతాలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి ఎస్ వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు బి లక్ష్మా, బి మంగీలాల్, ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.