23-06-2025 06:39:58 PM
ఖమ్మం (విజయక్రాంతి): మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంలో భాగంగా యువత, విద్యార్థులు భాగస్వామ్యం కావాలని ఖమ్మం అర్బన్ సీఐ భాను ప్రకాష్(CI Bhanu Prakash) అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఖమ్మం ఆర్బన్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం టేకులపల్లిలోని డైట్ కాలేజ్ లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించే లక్ష్యంలో యువత భాగస్వామ్యం కావాలని, తల్లిదండ్రులు నమ్మకంతో ఇచ్చిన స్వేచ్ఛను విద్యార్థులు దుర్వినియోగం చేసుకోకుండా ఉజ్వల భవిష్యత్తుకు పునాది వేయాలని అన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోకూడదని ప్లకార్డులు ప్రదర్శించారు. నాటిన ప్రతి మొక్కను రక్షించి భావితరాలకు బాసటగా నిలవాలని సూచించారు.