26-06-2025 12:00:00 AM
యురేనియం శుద్ధి, అణ్వాయుధ కార్యక్రమ జోలికి వెళితే మళ్లీ దాడులు
ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు
వాషింగ్టన్/టెల్ అవీవ్/ టెహ్రాన్: మానవాళికి హాని కలిగించే అణు కార్యక్రమాన్ని ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పేర్కొన్నారు. ఇరాన్ తన యురేనియం శుద్ధి కార్యక్రమం నిర్వహించినా..అణ్వాయుధాలను ప్రోత్సహించినా.. మరోసారి దాడులు చేయడానికి వెనుకాడబోమని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
అయితే ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి ఇస్మాయిల్ బఘయీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికా జరిపిన దాడులతో మా అణు కేంద్రాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దాని వ్యవస్థను రూపొందించుకునేందకు మాకు చాలా సమయం పట్టనుంది. మాపై చేసిన దాడికి అమెరికా నష్టం పరిహారం చెల్లించాలి లేదంటే ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు చేస్తాం’ అని తెలిపారు.
అంతకుముందు ఇరాన్లో అణు కేంద్రాలను ధ్వంసం చేయడంపై సామాజిక మాధ్యమం ‘ట్రూత్’లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ఆగాలని ఇజ్రాయెల్, ఇరాన్ సమానంగా కోరుకున్నాయన్నారు. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలు, అణు సామర్థ్యాలను ధ్వంసం చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవమన్నారు.
ఆ తర్వాతే యుద్ధాన్ని ఆపినట్టు తెలిపారు. ఇరాన్లో ప్రభుత్వం మారాలని తాను కోరుకోవడం లేదన్నారు. అన్ని సమస్యలు త్వరలోనే సద్దుమణుగుతాయని, పాలన మారడం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశముందన్నారు.
దాడుల్లో ఇరాన్కు నష్టం తక్కువే: అమెరికా ఇంటెలిజెన్స్
ఇజ్రాయెల్తో జరిగిన యుద్ధంలో ఇరాన్కు జరిగిన నష్టం గురించి పెంటగాన్కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) ఒక నివేదికను విడుదల చేసింది. అమెరికా ఇరాన్పై చేసిన దాడుల్లో నష్టం పరిమితంగానే ఉందని నివేదికలో పేర్కొనడం గమనార్హం. ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై అమెరికా బీ-2 స్పిరిట్ బాంబర్లతో భారీ దాడులకు పాల్పడింది.
తమ దాడుల్లో అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అయితే నివేదికలో మాత్రం అందుకు వ్యతిరేక కథనాలు ఉన్నాయి. అమెరికా దాడులు చేసిన వాటిలో ఫోర్డో, నతాంజ్లు పూర్తిగా నాశనం కాలేదని పేర్కొంది. యురేనియం శుద్ది చేసేందుకు ఉపయోగించే సెంట్రిఫ్యూజ్లు వంటి కీలక పరికరాలను ఇరాన్ కొన్ని నెలల్లోనే తిరిగి పునఃప్రారంభించుకోవచ్చని పేర్కొంది.
అయితే నివేదికను అమెరికా వైట్హౌస్ కొట్టిపారేసింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని నిర్మూలించిన యుద్ధ పైలట్ల ధైర్య సాహసాలను అప్రతిష్ఠపాలు చేసే ప్రయత్నమని పేర్కొంది. 30 వేల పౌండ్లు కలిగిన 14 బాంబులను కచ్చితమైన లక్ష్యాలపై వేస్తే ఎంత నష్టం జరుగుతుందో అందరికి తెలుసని, ఆ అణు స్థావరాలన్ని ధ్వంసమయ్యాయని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ పేర్కొన్నారు.
ఇంటెలిజెన్స్ నివేదికపై ట్రంప్ స్పందించారు. అవన్నీ నకిలీ వార్తలని.. చరిత్రలో అత్యంత విజయవంతమైన సైనిక దాడుల తీవ్రతను తగ్గించేందుకు కొన్ని వార్తా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారమని తెలిపారు. ఇటీవలే అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ వ్యాఖ్యలను కూడా ట్రంప్ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.
ఇరాన్లో ముగ్గురికి ఉరిశిక్ష
ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్కు సహకరించారన్న ఆరోపణలపై దోషులుగా తేలిన ముగ్గురు వ్యక్తులను ఇరాన్ బుధవారం మరణ శిక్ష అమలు చేసింది.ఆ దేశంలో సంబంధాలున్నాయనే ఆరోపణలపై సుమారు 700 మందిని అరెస్టు చేసినట్లు ప్రభుత్వ అనుబంధ సంస్థ పేర్కొంది.
ఇది చారిత్రాత్మక విజయం: నెతన్యాహు
ఇరాన్లో అణు కేంద్రాలు నాశ నం చేయడం ద్వారా తాము చారిత్రక విజయం సాధించామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ఇరాన్ను అంతం చేయడం త మ లక్ష్యం కాదని.. ముందు నుంచి ఆ దేశంలో ఉన్న అణు స్థావరాలే లక్ష్యం గా దాడులు చేసినట్టు మరోసారి గుర్తుచేశారు. ఇరాన్ అణు, బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలను నిర్వీర్యం చేయడంలో విజయం సాధించామన్నారు. తద్వారా అణు ముప్పును పూర్తిగా తొలగించడంలో విజయం సాధించామన్నారు. ఈ విషయంలో తమకు సహకారం అందించిన ట్రంప్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
హక్కులు వదులుకోవడానికి సిద్ధంగా లేము: పెజెష్కియాన్
అణ్వాయుధాలు తయారు చేయాలన్నది తమ లక్ష్యం కాదని.. శాంతియుత ప్రయోజనాల కోసమే అణు శక్తిని ఉపయోగించుకునే చట్టబద్ధమైన హక్కులను కాపాడుకుంటామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తెలిపారు. తమ ఉనికి ప్రశ్నార్థకమైతే అమెరికాను సైతం ఢీకొట్టగలమని దోహాలోని అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులతో నిరూపించామని ఆయన పేర్కొన్నారు.
వరుస దాడులతో అమెరికా, ఇజ్రాయెల్ను వణికించామన్నారు. యుద్ధ క్షేత్రం నుంచి ఎలా నిష్క్రమించాలో తమకు తెలుసునని.. పశ్చిమాసియాలో ఎన్నో దేశాల్లో అమెరికాకు స్థావరాలు ఉన్నప్పటికీ తమ మిత్రదేశమైన ఖతార్పై వ్యూహాత్మకంగా దాడులు చేశామని తెలిపారు. వందల కేజీల యురేనియంను దాచిపెట్టి మధ్యవర్తిత్వానికి తనవైపు కొన్ని అస్త్రాలున్నాయని ప్రపంచానికి చాటిచెప్పామన్నారు.