calender_icon.png 29 June, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 49 అమలు కానివ్వం

28-06-2025 12:00:00 AM

  1. జీవోపై గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు
  2. గిరిజనులు సాగుచేసే అటవీ భూములకు నష్టం ఉండదు
  3. ఆదివాసీల సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు 
  4. రిమ్స్ ఆసుపత్రి తనిఖీ చేసిన మంత్రి జూపల్లి

ఆదిలాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 49ని అమలు కాకుండా చూస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గిరిజనులు సాగు చేస్తున్న అటవీ భూములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నుండి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఉట్నూర్ మండలంలో మంత్రి పర్యటించారు.

ముందుగా ఎంపీ నగేష్, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్, కోవ లక్ష్మి, హరీష్ బాబు, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, వెంకటేష్ దోత్రే, ఎస్పీ లు అఖిల్ మహాజన్, కాంతిలాల్ పాటిల్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా తో కలిసి ఇంద్రవెల్లి లోని అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, స్మృతి వనంలో మొక్కలు నాటారు. అనంతరం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకల ఆస్పతిగా మార్చడంతో పాటు వివిధ సౌకర్యాల కల్పనకు 13.70 లక్షలతో చేపట్టే వివిధ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

అనంతరం ఆదివాసీలతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసి సంఘాల నాయకులు మాట్లాడుతూ గిరిజన ప్రాంతం 5వ షెడ్యూల్ లో ఉన్న ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల పరిధిలో ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయని, ఆదివాసీలు తమ భూములు, గ్రామాలు పూర్తిగా కోల్పోతున్నారని, ఇతర పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకోవచ్చారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రభు త్వ ఉత్తర్వుల వల్ల గిరిజనుల సాగు చేస్తున్న వ్యవసాయ భూములు, అటవీ భూములకు ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. అటవీ అధికారులు జీవో49లోని అంశాల వల్ల ఎలాంటి నష్టం రాదని ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రస్తుతం జి.ఓపై ఎలాంటి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపారు.

రాష్ట్ర అటవీ శాఖ సి.సి.ఎఫ్. అధికారితో జి.ఓ పై మాట్లాడడం జరిగిందని, వారు దీనివల్ల గిరిజనులకు ఎలాంటి నష్టం జరగదని, గిరిజనులు సాగు చేస్తున్న భూము లు, ఆర్.ఓ.ఎ ఫ్.ఆర్ పట్టా భూములు వారి ఆధీనంలోనే ఉంటాయని, గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారని వివరించారు.

డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలి: మంత్రి జూపల్లి 

యువత మాదకద్రవ్యాలకు, డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ డ్రగ్స్ రహిత  సమాజం కోసం పాటుపడాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జీ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన 5k రన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ముందుగా ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఏఎస్పీ కాజల్ సింగ్ తో కలిసి 5k రన్ ను జెండా ఊపి ప్రారంభించి, స్వయంగా రన్ లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం 5K రన్ ను పూర్తి చేసి విజేతలుగా నిలిచిన మొదటి 15 మంది విద్యార్థులకు సైకిలను బహుమతులుగా అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవితం విలువైనది, చిన్నదని దానిని నలుగురికి ఉపయోగ పడేలా జీవించాలి అని తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండటం వల్ల కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు అభివృద్ధి చెందేలా ఎదగవచ్చని తెలియజేశారు. కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని తెలిపారు. 

అనంతరం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి తో పాటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మంత్రి తనిఖీ చేశారు. ఎంపీ నగేష్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ ఎస్పీతో కలిసి ఆసుపత్రిలోని వివిధ వార్డులను పరిశీలించి, రోగులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ పలు అంశాలను మంత్రికి వివరించారు. అదేవిధంగా వనమహోత్సవంలో భాగంగా మావల హరితవనం పార్క్ లో మంత్రి మొక్కలు నాటారు.

అంతకుముందు టూరిజంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను అటవీ శాఖ అధికారి ప్రశాంత్ బాజీరావ్‌తో కలిసి వీక్షించారు. టూరిజం అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్నారు. ఆదిలాబాద్‌లో ఎకో టూరిజం అభి వృద్ధి చేయడానికి ఎక్కువ అవకాశం ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.