calender_icon.png 2 June, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌పై ఈగ వాలనివ్వం

01-06-2025 01:29:31 AM

  1. బీఆర్‌ఎస్, జాగృతి కేసీఆర్‌కు రెండు కళ్లు
  2. కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ కమిషన్
  3. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): తమ పార్టీ అధినేత కేసీఆర్‌కు బీఆర్‌ఎస్, తెలంగాణ జాగృతి రెండు కళ్లలాంటివని ఎ మ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. స్వ రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణవాదాన్ని నిలబెట్టడంలో జాగృతి ముఖ్య పాత్ర పోషించిందని ఉద్ఘాటించారు. శనివారం ఆమె హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన నూతన తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించి మాట్లా డారు.

సంస్థను ప్రారంభించి దాదాపు 18 సంవత్సరాలు కావొస్తుందని, సంస్థ ద్వారా వందలాది కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. ఉద్యమన నేత కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితోనే జాగృతి సంస్థ ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. సంస్థ తరఫున తాము పోరాటం చేస్తుంటే కొందరు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్‌పై ఈగ వాలినా జాగృతి సంస్థ సహిం చదని చెప్పుకొచ్చారు. గతంలో జాగృతి కార్యాలయంలో అశోక్‌నగర్‌లో ఉండేదని, నూతన కార్యాలయం ఇప్పుడు బంజారాహిల్స్‌కు మార్చామని కవిత స్పష్టం చేశారు. కా ర్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీరావు బాధ్యతలు నిర్వర్తిస్తారని వెల్లడించారు.

రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలి..

తన రాజకీయ జీవితంలో ఒక్కసారైనా ‘జై తెలంగాణ’ అనని రేవంత్‌రెడ్డి రాష్ట్రముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా సీఎం ‘జై తెలంగాణ’ అని నినదించాలని, అమర వీరులకు మనస్ఫూర్తిగా నివాళి అర్పించాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు. లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత రేవంత్‌రెడ్డికి లేదని అభిప్రాయపడ్డారు.

యువతకు చేయూత నిచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం పేరు మార్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు రాజీవ్‌గాంధీకి ఎలాంటి సంబంధం లేదని, అలాంటప్పుడు ఆ పథకానికి రాజీవ్‌గాంధీ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. పథకానికి అమరులు శ్రీకాంతాచారి లేదా యా దిరెడ్డిగా నామకరణం చేయాలని డిమాండ్ చేశారు.

లేదంటే ఉద్యమాల వారధి కాళోజీ నారాయణరావు, లేదంటే రాజకీయ దురంధరుడు పీవీ నరసింహారావు పేరు పెట్టినా ప్రజలు హర్షిస్తారని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి నోరుమెదపకపోవడం శోచనీయమన్నారు. పొరుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం సీఎం పనిచేయడం సిగ్గుచేటన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ నదుల అనుసంధానాన్ని తొపాకులగూడెం నుంచే చేపట్టాలని ప్రతిపాదించారని, కానీ, కేంద్ర ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదని గుర్తుచేశారు. పోలవరం నుంచి  200 టీఎంసీల గోదావరి జలాలను ను తరలించే ప్రయత్నం జరుగుతోందని, ఆ జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరంకానున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై  జూన్ 2న సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ఆమె సూచించారు. 

కాళేశ్వరం కమిషనా లేదా కాంగ్రెస్ కమిషనా?

గోదావరి జలాల్లో 200 టీఎంసీల హక్కు తెలంగాణకు ఉండాలని నాడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని, తద్వారా యేటా 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపేది పోయి, నోటీసులు ఇవ్వడం బాధాకరమన్నారు. కాళేశ్వరం కమిషన్.. కాంగ్రెస్ కమిషన్‌లా వ్యవహరిస్తుం దని ఆరోపించారు.

తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇవ్వడమంటే, యావత్ తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చిన్నట్లేనని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం జాగృతి ఏడాదిన్నరగా పోరా టం చేస్తున్నదని, సీఎం ఇటీవల ప్రధాని మోదీని  కలిసిన సమయంలో ప్రాజెక్టుల గురించి మాట్లాడారే, కానీ బీసీ బిల్లుపై మా ట్లాడకపోవడం బాధాకరమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం  బీసీ రిజర్వేషన్ల బిల్లును డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. అలా చేస్తే జాగృతి చూస్తూ ఊరుకో దన్నారు. కాంగ్రెస్, బీజేపీకి సెగ తాకే విధం గా పోరాటం చేస్తామన్నారు. రైల్ రోకో వంటి నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జాగృతి బీసీ రిజర్వేషన్ల సా ధన కోసమే కాకుండా కాంగ్రెస్ ఇచ్చిన హా మీలైన మహిళలకు నెలకు రూ.2,500, ఆడపిల్లలకు స్కూటీలను సాధించే వరకు పోరాడతామన్నారు.

కేసీఆర్‌కు నోటీసుల జారీపై 4న మహాధర్నా

కాళేశ్వరం కుంగుబాటు విషయంలో విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇటీవల బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసిన సంగతి విదితమే. నోటీసుల జారీపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కేసీఆర్‌పై ఈగ వాలనీయకుండా చూసుకుంటామని, దీనిలో భాగంగానే నోటీసుల జారీకి నిరసనగా ఈనెల 4న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో మహాధర్నా చేపడతామని ప్రకటించారు.

మరోవైపు జాగృతి నూతన కార్యాలయ ప్రాంగణంతో పాటు లోపల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేవలం ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ ఫొటోలు మాత్రమే కనిపించడం గమనార్హం. అలాగే ఆమె నివాసం ముందు ‘డాటర్ ఆఫ్ ఫైటర్ విల్ నెవర్ ఫియర్ (నేను పోరాటయోధుడి బిడ్డను. నాకు భయమంటే తెలియదు’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.

అలాగే బీఆర్ అంబేద్కర్, తెలంగాణ తల్లి, జోతిబా ఫూలే, సావిత్రిబాయి పులే విగ్రహాలూ కనపించాయి. అమరవీరుల స్థూపాన్ని కూడా కవిత కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఈ పరిణామాలన్నింటినీ చూస్తుంటే త్వరలో ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో కవిత పాలపిట్ట రంగు చీర ధరించి సమావేశాలకు హజరవుతుండటంపైనా చర్చలు నడుస్తున్నాయి.