28-06-2025 08:28:00 PM
మోదీ చేపట్టే కులగణన దేశానికి దిక్సూచి
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి
బిజెపి ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
నల్గొండ టౌన్,(విజయక్రాంతి): కులగణనపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు మొసలి కన్నీరు కారుస్తున్నారని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ విమర్శించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని స్టే ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రివర్గంలో ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని జనగణనతో పాటు, కుల గణన చేపడతామని ప్రకటించడం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. మోదీ చేపట్టే కుల గణన దేశానికి దిక్సూచిగా నిలుస్తోందని లక్ష్మణ్ అన్నారు.
ఇవాళ యావత్ దేశం మోదీని అభినవ అంబేద్కర్ అంటూ కొనియాడుతున్నారని అన్నారు. 60ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కుల గణన ఎందుకు చేపట్టలేక పోయిందంటూ ప్రశ్నించారు. మండలి కమిషన్ సిఫార్సులు చెత్తబుట్టలో వేసిన చరిత్ర నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలది అంటూ విమర్శించారు. నాటి నుంచి నేటి వరకు ఓబీసీలకు కాంగ్రెస్ విరోధిగానే ఉందని కాంగ్రెస్ పాలనంతా బీసీలను అణిచివేసిన చరిత్రే అంటూ విమర్శించారు. కోర్టులో కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా కులగణన చేస్తా మని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ద్వారా లెక్కలు ఉంటాయన్నారు.
కాంగ్రెస్ అశాస్త్రీయంగా సర్వే చేస్తే మేము శాస్త్రీయంగా లెక్కలు చేస్తాం అని అన్నారు. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీ సంఘాలను బలోపేతం చేయడం ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యం మని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీసీలను మోసం చేసిందని 34 శాతం రిజర్వేషన్ 27 శాతానికి తగ్గించింది అని విమర్శించారు. నరేంద్ర మోడీ పాలనలో అనేక ప్రణాళికలు రూపొందించనునట్లు ఆయన చెప్పారు. బీసీల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధ మల్ల ఆనంద్ గౌడ్, బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మాధగోని శ్రీనివాస్ గౌడ్, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజు యాదవ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.