35 ఏళ్ల సుదీర్ఘ సేవలు అమోఘం
కరీంనగర్ క్రైమ్,(విజయక్రాంతి): పోలీసు శాఖలో హోంగార్డుగా చేరి, 35 సంవత్సరాలుగా నిస్వార్థంగా సేవలందించిన నాగిని రాజేందర్ పదవీ విరమణ సందర్భంగా శనివారం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ శ్రీ గౌష్ ఆలం ముఖ్య అతిథిగా హాజరై, రాజేందర్ ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ, కమీషనరేట్ కేంద్రంలో సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వహించిన నాగిని రాజేందర్, తన 35 ఏళ్ల సర్వీసులో ఎంతో అంకితభావంతో, నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు. పోలీసు శాఖలో హోంగార్డుల పాత్ర కీలకమని, క్షేత్రస్థాయిలో వారు అందించే సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు.
పదవీ విరమణ పొందిన రాజేందర్ శేష జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో గడవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది సమక్షంలో నాగిని రాజేందర్ కు పూలమాల వేసి ఘనంగా సన్మానించారు. తన సర్వీసు కాలంలో తోటి సిబ్బందితో స్నేహపూర్వకంగా ఉంటూ, విధుల్లో క్రమశిక్షణ పాటించిన ఆయనను పలువురు అధికారులు అభినందించారు. ఈ వీడ్కోలు కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ (హోంగార్డ్స్) శ్రీధర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రవి మరియు కమిషనరేట్కు చెందిన ఇతర పోలీసు అధికారులు, హోంగార్డు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






