08-11-2025 08:40:06 PM
* చంపేందుకు భర్త అత్తమామలపై చర్యలు తీసుకోవాలని ఆందోళన..
* బాధితురాలితో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఓ ఆదివాసీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని, అనంతరం కట్నం కోసం వేధించడంతో పాటు చివరకు చంపేందుకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఆందోళనకు దిగింది. శనివారం జిల్లా కలెక్టరేట్ ఎదుట బాధితురాలితో కలిసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకుడు పూసం సచిన్ మాట్లాడుతూ... జైనథ్ మండలం బేల్లూరి గ్రామానికి చెందిన విజయ్ రెడ్డి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన ఆదివాసీ గోండు తెగకు చెందిన సోనీ అనే యువతిని 2023లో ప్రేమపెళ్లి చేసుకున్నాడని తెలిపారు.
ఐతే ఇటీవల కట్నం కోసం భర్త విజయ్ రెడ్డి, అత్తమామ అశోక్ రెడ్డి, భూమక్క బాధితురాలు సోనీను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తాజాగా బాధితురాలికి బలవంతంగా పురుగుల మందు తాగించి, చంపడానికి యత్నించారని పేర్కొన్నారు. ఈ విషయమై జైనథ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన, ఇంతవరకు ఎలాంటి చర్యలు కేసు పెట్టిన ఇంతవరకు అరెస్టు చేయలేదని ఆరోపించారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు పోరాడతామని వెల్లడించారు. నిరసన కార్యక్రమంలో పలువురు గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.