అరైవ్ - అలైవ్ ముఖ్యలక్ష్యమే సురక్షిత ప్రయాణం
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వ శాఖలతో సమన్వయం
రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
గోదావరిఖని,(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజల వాహనదారుల ప్రాణాల రక్షణే ముఖ్య ఉద్దేశ్యం తో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఆర్రైవ్ - అలైవ్ కార్యక్రమంలో భాగంగా గౌరవ రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా మార్గదర్శకత్వంలో, డీసీపీ బి. రామ్ రెడ్డి, రామగుండం ట్రాఫిక్, గోదావరిఖని 1- టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్, విద్య, రోడ్డు రవాణా, ఆరోగ్య, ఆర్ అండ్ బి శాఖ, తదితర శాఖల అధికారులు, ఉద్యోగులకు రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీతో పాటు అడిషనల్ కలెక్టర్, పెద్దపల్లి డీసీపీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఆర్రైవ్- అలైవ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులతో సమన్వయం చేస్తున్నామన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడాది 30 శాతం ప్రమాదాల నివారణ కోసం చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అందులో భాగంగా మున్సిపల్, విద్య, ఆరోగ్య, రోడ్డు రవాణా, ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులతో కలిసి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు ట్రాఫిక్ పై అవగాహన కల్పించేలా చొరవ చూపాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్రైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సమన్వయము తో అవగాహన కల్పించడం జరుగుతుందని, ఇందుకోసం ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు.
ట్రాఫిక్ రూల్స్ను తప్పక పాటిస్తూ వాహనాలు నడపడం, సేఫ్ అండ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులు అనుసరించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కార్ ఇతర ఫోర్ వీల్ నడిపే వాహనదారులు సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అలాగే ప్రతి వాహనదారుడి వద్ద డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటి వాహన ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలని, ఇవి చట్టపరంగానే కాకుండా ప్రమాద సమయంలో ఆర్థిక భద్రతను కూడా కల్పిస్తాయని సీపీ వివరించారు.
ప్రభుత్వ ఉద్యోగులు ముందుగా రోడ్డు భద్రత నియమాలను పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని, వారి బాధ్యతాయుత ప్రవర్తనతో సమాజంలో మార్పు తీసుకురావచ్చని సీపీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు సిపి హెల్మెట్ లను పంపిణీ చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ యాదవ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరిఖని 1- టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ సీఐ రాజేశ్వరరావు, ఎంఈఓ మల్లేష్, సివిల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. కృపా భాయ్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ సాగర్, రోడ్లు & భవనాల శాఖ డిఈ జాఫర్, ఆర్ టిసీఏ డిఎం రామగుండం, ఎస్ఐ రమేష్, అనూష, ట్రాఫిక్ ఎస్ ఐలు హరిశేఖర్, రామరాజు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




