ట్రాన్స్ఫార్మర్లో భారీ అగ్నిప్రమాదం
పోమాల గ్రామంలో స్థానికుల భయాందోళన
నవాబుపేట : మండలంలోని పోమాల గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం తప్పింది. గ్రామంలోని మహిళా సమాఖ్య భవనం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే ట్రాన్స్ఫార్మర్లో సాంకేతిక లోపం తలెత్తి, ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
మంటలను గమనించిన గ్రామస్తులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సరఫరాను నిలిపివేశారు. అనంతరం ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా, అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్తో వేగంగా స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. సమయానికి అధికారులు, సిబ్బంది స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని,ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారని స్థానికులు తెలిపారు.






