24న ఇందిరా పార్కులో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయండి
బీసీ రిజర్వేషన్ల సాధన సమితి పిలుపు..
హనుమకొండ (విజయక్రాంతి): కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన వాగ్దానం మేరకు బీసీలకు 42% విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించి, గవర్నరుకు పంపించి, దానిని కేంద్రానికి పంపి బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ ఈ నెల 24న ఇందిరా పార్క్ లో మహా ధర్నాను విజయవంతం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ విజ్ఞప్తి చేశారు.
బుధవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని, విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42 శాతం రిజర్వేషన్కు అనుకూలంగా బిల్లు పెట్టి కేంద్రానికి పంపించాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం వ్యవస్థాపకులు చిరంజీవులు, చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య, బాలరాజ్ గౌడ్, విశారదన్ మహరాజ్ లు కలిసి 42% రిజర్వేషన్ సాధన సమితిగా ఏర్పడి చేసే మహా ధర్నాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మేధావులు, విద్యార్థులు, ఉద్యోగాలు, అందరూ కలిసి విజయవంతం చేయాలన్నారు. అనంతరం చలో హైదరాబాద్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డాక్టర్ చందా మల్లయ్య, రిటైర్డ్ ప్రొఫెసర్ విజయబాబు, డాక్టర్ వీరస్వామి, సాయిబాబా, సుమన్, రంజిత్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.






