01-06-2025 12:06:25 AM
ఇతరులను సంతోషపెట్టాలనుకోవడం ఎప్పుడూ మనకు భారమే అవుతుందని అంటోంది రష్మిక మందన్న. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే అసలు ఒత్తిడే ఉండదని చెబుతోంది. నేషనల్ క్రష్గా అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇలా మాట్లాడటానికి కారణం లేకపోలేదు. రష్మిక కథానాయకిగా నటించిన ‘ఛావా’ మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాత విడుదలైన ‘సికందర్’లోనూ ఆమే హీరోయిన్. తను నటించిన సినిమాలు వెనువెంటనే విడుదల కావటం, ఒకటి ప్రేక్షకాదరణను పొందితే, మరొకటి ఆశించిన స్థాయిలో అలరించకపోవటం ఇలా మిశ్రమ ఫలితాన్ని అందుకుంది రష్మిక. ఇదే విషయమై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్, ఒతిళ్ల గురించి ప్రస్తావించింది. ‘జీవితంలో ఏదీ శాశ్వతం కాదని నాకు తెలుసు.
ఇదే అంశం గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. ఓ రోజు మనకు అనుకూలంగా ఉంటే, మరుసటి రోజే అంతా మారిపోతుంది. కెరీర్ విషయంలో నేనెప్పుడూ స్థిరంగా ఉంటాను. అందరికీ నేనిచ్చే సలహా కూడా ఇదే. మనసుకు నచ్చిన పని చేయాలి. కూర్గ్ లాంటి చిన్న పట్టణంలో పుట్టిన నేను.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి కారణం అదే. అయితే ఒడిదొడుకులను ఎదుర్కొనే క్రమంలో నా కుటుంబం, స్నేహితులు నాకు అండగా ఉండటం నా అదృష్టంగా భావిస్తాను. నిజానికి నటిని అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు.
ఈ రంగంలో వచ్చేందుకు ఎలాంటి ప్రణాళికలూ వేసుకోలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నేనెంత అదృష్టవంతురాలినో అర్థమవుతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగడమే మన పని. ఈ ప్రయాణంలో కఠినమైన పాఠాలుండవు.. అన్నీ విలువైనవే. ఎప్పుడూ ఉత్తమంగా ఉండటానికే ప్రయత్నించండి.. కానీ, ఇతరులను సంతోషపెట్టాలనే భారాన్ని మోయకండి. మీ ఆనందంపైనే దృష్టిపెట్టండి” అని తెలిపింది రష్మిక.