రైతును రాజు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు
హనుమకొండ టౌన్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం పెగడపల్లి గ్రామంలో పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధరను పొందాలని సూచించారు. రైతును రాజుగా నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. వరంగల్ రైతు డిక్లేషన్ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ రైతులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రతి క్వింటానికి 500 రూపాయల బోనస్ అందిస్తుందని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి రైతు పక్షపాతాన్ని నిరూపించిందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే దాన్యగారంగా రూపొందుకుంటుందని, రైతులు పండించిన ప్రతి దాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, తమ ధాన్యాన్ని రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుత వాతావరణం మార్పులను దృష్టిలో ఉంచుకొని కొలుగోలు ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అవకతవకలు, మోసాలకు పాల్పడిన ఉపేక్షించేది లేదని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






