15 April, 2026 | 4:13 AM

ఒక కులాన్ని అడ్డుపెట్టుకుని ఆడుతున్నారు

23-11-2025 10:05 PM

- మా జాతికి అడ్డు ఎవరూ లేరు, దమ్ము ఎవరికీ లేదు

- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

- సరూర్ నగర్ స్టేడియంలో మాలమహానాడు రణభేరి 

ఎల్బీనగర్: కేంద్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒక కులాన్ని అడ్డుపెట్టుకుని వర్గీకరణ పేరుతో మాలల కులాన్ని ఆడుకుంటున్నారని, మాకు అన్యాయం జరిగితే ఉద్యమాలు తప్పవని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య హెచ్చరించారు. సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం మాలమహానాడు రణభేరి సభ నిర్వహించారు. ఈ సభకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మాలల సంఘాల నాయకులు, మాల కులస్తులు భారీగా తరలివచ్చారు. ఈ సభలో చెన్నయ్య మాట్లాడుతూ... ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు తొత్తుగా మారి మాలల కులస్తులను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకుండా కుట్ర చేస్తున్నారన్నారు.

వర్గీకరణ అంటూనే మాలలకు ఇచ్చే రిజర్వేషన్లల్లో రోస్టర్ విధానంతో మాలలను అణగదొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ న్యాయ మూర్తుల చేత వర్గీకరణ చేయించాడు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు దుర్మార్గుడని విమర్శించారు. అసెంబ్లీలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఒక్కడే మాల ల గురించి మాట్లాడాడని అభినందించారు. అసెంబ్లీలో మాలల గురించి మిగతా ఎమ్మెల్యేలు ఎవరూ నోరు విప్పలేదని మండిపడ్డారు. రిజర్వేషన్లతో ఉద్యోగాలు సాధించిన మాలలు సైతం నోరు విప్పడం లేదని, మాలల జాతిని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేస్తే 5 శాతం రిజర్వేషన్ ఉన్నా మనకు ఉద్యోగాలు ఎందుకు వస్తలేవు అని ప్రశ్నించారు. హైకోర్టులో నేను కేసు వేశా, ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటామని పేర్కొన్నారు. మాలలు అందరూ ఐక్యంగా ఉంటూ రోస్టర్ పాయింట్లను సవరించుకోవాలని సూచించారు.

మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు మల్లీశ్వరి మాట్లాడుతూ.. రాజ్యాంగం అంటే మంద కృష్ణ మాదిగకు తెలియదని, ముప్ఫై సంవత్సరాలుగా మంద కృష్ణ మాదిగలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. మాలల జాతికి రాజకీయ నాయకులు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన దేవుడు అంబేద్కర్...మాలల జోలికి వస్తే తెలుగు రాష్ట్రాల సీఎంల అంతు చూస్తామని హెచ్చరించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వెంకటేశం మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ కోసం 2011 లెక్కలు తీసుకొని మాలలకు అన్యాయం చేశారన్నారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు విద్య, ఉద్యోగ, రాజకీయాలలో అన్యాయం జరుగుతుందన్నారు. దివంగత పీవీ రావు 2004 లోనే వర్గీకరణ తప్పు అని చెప్పారని గుర్తు చేశారు. మాలలకు న్యాయం చేయాలని నవంబర్ 26న ఇందిరా పార్క్ దగ్గర ఒక రోజు దీక్ష చేస్తామని తెలిపారు. సభలో మాల మహానాడు నాయకులు జనరల్ రంజిత్ కుమార్, జై కుమార్, కోటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.