రూ. 4000 వేల కోసం.. సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో శనివారం ఉదయం తన జేబులోంచి రూ.4 వేలు ఎవరో దొంగిలించారని ఆరోపిస్తూ ఒక వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తిని జోగిపేట నివాసి మక్కల అశోక్ (28) గా గుర్తించారు. శుక్రవారం ఒక వార్డు కౌన్సిలర్ అతనికి అనుకూలంగా ఓటు వేయడానికి రూ.4,000 ఇచ్చినట్లు సమాచారం. శనివారం ఉదయం అతను తన నివాసంలో నిద్ర లేచి చూసేసరికి ఆ డబ్బు కనిపించలేదు. కోపంతో అశోక్ తన ఇంటి నుంచి బయటకు పరిగెత్తి సెల్ టవర్ ఎక్కి, తన డబ్బును దొంగిలించిన వారు వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు, లేకుంటే టవర్ పై నుండి దూకుతానని బెదిరించాడు. అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఆ మొత్తాన్ని ఇస్తామని హామీ ఇచ్చి, అతన్ని కిందకు రమ్మని ఒప్పించారు. గంటకు పైగా ప్రయత్నాల తర్వాత, అతను చివరికి టవర్ నుండి కిందకు దిగాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.




