విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
సూర్యాపేట,(విజయక్రాంతి): విద్యుత్ ఆగాథంతో వ్యక్తి మృతి చెందిన ఘటన జిల్లాలోని కోదాడ మండల పరిధిలో గల ద్వారకుంట గ్రామ సమీపంలోని నెమలిపురి గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెడ్డిబోయిన గోపి (20) అనే వ్యక్తి గ్రామంలో మీటర్ రీడర్ గా పనిచేస్తూనే, విద్యుత్ శాఖ సిబ్బందికి సహాయకుడిగా విధులు నిర్వహించేవాడన్నారు. అయితే నెమలిపురి గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమస్యను పరిష్కరించేందుకు అధికారుల సూచన మేరకు గోపి విద్యుత్ స్తంభం ఎక్కి మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా కావడంతో గోపి, స్తంభంపైనే అపస్మారక స్థితికి చేరుకున్నాడన్నారు. ఆది గమనించిన పలువురు వెంటనే కిందకు దించి దవాఖానకు తరలించేలోగా మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో ఆ తల్లిదండ్రులు, బంధువులు రోదనలు మిన్నంటాయి.
ఉద్యోగి కాని వ్యక్తితో ప్రమాదకరమైన విద్యుత్ పనులు చేయించడం ఎంతవరకు సమంజసమని స్థానికులు విద్యుత్ శాఖాధికారులను ప్రశ్నిస్తున్నారు. గోపి మృతికి కారణమైన వారిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకోవాలని కోరుతున్నారు.






