పనులు వేగవంతం
ఈ సీజన్కు నీరందేలా ముమ్మరంగా కాళేశ్వరం బరాజ్ల మరమ్మతులు
ఎన్డీఎస్ఏ సూచనల మేరకు పనుల నిర్వహణ
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి
మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్ల సందర్శన
మరమ్మతు పనుల పరిశీలనలో అధికారులపై ఆగ్రహం
* రైతుల కోసం బీఆర్ఎస్ సర్కారు పాపాలను మోస్తున్నం. కాళేశ్వరాన్ని బాధ్యత లేకుండా గత ప్రభుత్వం నిర్మించింది. నాసిరకం పనులతోనే మేడిగడ్డ బరాజ్ కుంగింది. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో దోషిగా నిలబెడతాం.
మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి
పెద్దపల్లి (మంథని), జూన్ 7(విజయక్రాంతి): ప్రస్తుత వానకాలం సీజ న్కు వ్యవసాయానికి నీరందించేందుకు వీలుగా కాళేశ్వరం బరాజ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నట్టు నీటిపారుదలశాఖ మంత్రి ఉత్త మ్కుమార్రెడ్డి తెలిపారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజాధనం దుర్వినియోగం కావద్దనే ఉద్దేశంతో మరమ్మతు పనులు చేపట్టామని తెలిపారు.
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) అధికారులు క్షణ్ణంగా పరిశీలించి నివేదికలు ఇచ్చిన తర్వాతే మర మ్మతు పనులను మొదలుపెట్టామని చెప్పారు. మూడు ఏజెన్సీలకు మరమ్మతు పనులు అప్పగించామని వెల్ల డించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు తాము చేయకూడదన్న ఉద్దేశంతో మరమ్మతు పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో మంథని మండలంలోని సుందిళ్ల బరాజ్ మరమ్మతు పనులను పరిశీలించారు. పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత సీజన్కు నీరందించేలా పనులు చకచకా జరుగుతున్నాయని తెలిపారు.
బీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యం వల్లే
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత పెద్ద ప్రాజెక్టును నిర్మించినప్పుడు ఏమాత్రం బాధ్యత లేకుండా పని చేసిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. నాసిరకం పనులు చేపట్టడం వల్లనే మేడిగడ్డ వద్ద బరాజ్ కుంగిందని ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పిదాలను, లోటుపాట్లను ఇప్పుడు తమ నెత్తిన వేసుకొని రైతుల కోసం మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నామని వివరించారు. ప్రాజెక్టు నిర్మాణంలో లొసుగులను తెలుసుకొనేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ బరాజ్ సందర్శనకు రానున్నదని వెల్లడించారు.
తమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మిస్తాం
అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ను త్వరలోనే నిర్మిస్తామని మంత్రి ఉత్తమ కుమార్రెడ్డి తెలిపారు. సుందిళ్ల బరాజ్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్ప దని అన్నారు. మంత్రివర్గ సమావేశంలో తమ్మిడిహెట్టి ప్రాజెక్ట్పై చర్చించి సీఎం రేవంత్రెడ్డి అదేశాలతో పనులు చేపట్టేందకు నిర్ణయం తీసుకుంటున్నామని వెల్లడించారు. త్వరలోనే పేదలకు కొత్త రేషన్కార్డులు జారీ చేస్తామని, ఆ తర్వాత బీపీఎల్ కార్డులపై సన్న బియ్యం కూడా పంపిణీ చేస్తామని ప్రకటించారు.
రేషన్ బియ్యం అక్రమంగా అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూపాలపల్లి జిల్లాలోని అన్నారం, మేడిగడ్డ బరాజ్లను కూడా మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తుమ్మిడిహెట్టి దగ్గర రూ.38 వేల కోట్లతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రాజెక్టు నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధం చేసిందని తెలిపారు. దానిని బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కనబెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింని, ఇప్పుడు కాళేశ్వరం పార్జెక్టు కరెంటు బిల్లే రూ.10 వేల కోట్లు వస్తుందని విమర్శించారు.
లక్షల కోట్లు ఖర్చుపెట్టి కమీషన్లు తీసుకున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారని, కానీ, తాము అధికారంలోకి రాగానే కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కలిస్తే.. అసలు జాతీయ హోదా కోసం గత ప్రభుత్వం దరఖాస్తు కూడా చేయలేదని తెలిపారని పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరితే 60 శాతం నిధులు ఇస్తామని కేంద్రం చెప్పిందని వెల్లడించారు. మంత్రి వెంట ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మక్కన్సింగ్ తదితరులు ఉన్నారు.






