30-05-2025 01:24:23 AM
భువనేశ్వర్, మే 29: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు కుంజామ్ హిడ్మా అలియాస్ మోహన్ను పోలీసులు గురువారం తమ అదుపులోకి తీసుకున్నారు. మొదట మోస్ట్ వాంటెడ్, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడావి హిడ్మాగా భావించినప్పటికీ పోలీసుల విచారణలో కొరాపుట్ జిల్లా ఏరియా కమిటీ సభ్యుడైన కుంజామ్ హిడ్మాగా గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు.
‘ఆపరేషన్ కగార్’లో భాగంగా ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి కొరాపుట్లోని బోయిపరిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని పెటగూడ అడవుల్లో అతడిని అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని పక్కా సమాచారం అందడంతోనే భద్రతా దళాలు అక్కడ కూంబింగ్ నిర్వహించి హిడ్మాను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడ్డారు.
దీంతో మావోలకు, పోలీసు బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే చాలా మంది మావోయిస్టులు అక్కడి నుంచి పారిపోగా.. హిడ్మా మాత్రం చెట్ల పొదల్లో తలదాచుకున్నాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా హిడ్మా నుంచి ఏకే 47 రైఫిల్ సహా 35 రౌండ్ల బుల్లెట్లు, 27 ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్, 90 నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, 2 కేజీల గన్ పౌడర్, రెండు స్టీల్ కంటైనర్స్, రెండు రేడియోలు, ఇయర్ ఫోన్, వాకీటాకీ, మారణాయుధాలు, టార్చ్లైట్లు, ఒక పాలిథీన్ కవర్, మావోయిస్టు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు లభించినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఛత్తీస్గడ్ బీజాపూర్కు చెందిన కుంజామ్ హిడ్మా 2007లో 14 ఏళ్ల వయసు నుంచి మావోయిస్టు ఉద్యమంలో ఉన్నట్టు పోలీసులు వివరించారు. మల్కన్ గిరి, కొరాపుట్, సుక్మా, బిజాపూర్ మావోయిస్టు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నట్టు తెలిపారు. తొలుత మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా బలగాలకు చిక్కినట్టు ప్రచారం జరిగింది. అయితే తమకు చిక్కింది మడావి హిడ్మా కాదని కుంజామ్ హిడ్మా అని పోలీసులు వివరణ ఇచ్చారు. అగ్రనేత మడావి హిడ్మా ప్రస్తుతం పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1కు కమాండ్కు ఉన్నారు.