గోపాల్పేటలో మార్కండేయ జయంతి వేడుకలు
పురాతనంలో మార్కండేయ మహర్షి గురించి అనేక కథలు ప్రస్తావించబడినాయి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండలంలోని గోపాల్పేట్లో మార్కండేయ జయంతిని పద్మశాలి సంఘం మండల ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. మార్కండేయ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ... మార్కండేయ మహర్షి హిందూ సంప్రదాయంలో ప్రముఖమైన పురాతన ఋషిగా, బృగు ఋషివంశంలో జన్మించారని తెలిపారు.
ఆయన శివుడు, విష్ణువు ఇద్దరికీ పరమభక్తుడిగా పూజించబడతారు. పురాణాలలో మార్కండేయ మహర్షి గురించి అనేక కథలు ప్రస్తావించబడినట్లు తెలిపారు. శివుడు మార్కండేయుడిని రక్షించిన ఘట్టం భక్తులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ సంఘటన వారణాసి సమీపంలోని కైథి ప్రాంతంలో గోమతినది ఒడ్డున జరిగినట్లు పురాణ కథనాలు చెబుతున్నాయనన్నారు. అక్కడ ‘మార్కండేయ మహాదేవ ఆలయం’గా ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం ఉందని వివరించారు. మార్కండేయ మహర్షి బోధనలు సత్యం, ధర్మం,భక్తి మార్గాలను నేటి తరానికి గుర్తుచేస్తాయని పేర్కొన్నారు.




