calender_icon.png 10 June, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రహదారిపై సంత.. రాకపోకలకు చింత

10-06-2025 12:00:00 AM

గద్వాల, జూన్ 9 ( విజయక్రాంతి ) : జిల్లా కేంద్రంలోని ప్రతి సోమవారం నిర్వహించు వారాంతపు సంత రహదారిపైనే నిర్వహిస్తుండడంతో వాహనాల రద్దీ అధికంగా ఉంటున్నది. గద్వాల మున్సిపాలిటి పరిధిలోని తేరుమైదానంలో ప్రతి సోనవారఙ వారంతపు సంత నిర్వహిస్తారు. కూరగాయలు, చిరుదాన్యాలు, వ్యవసాయ పనిముట్లు, తినుబండారాలు, ఇతర నిత్యావసర సరుకులు విక్రయాలకు దుకాణుదారులు తాత్కాలికంగా ఏర్పాటు చేసి విక్రయిస్తారు.

చిరువ్యాపారులు తేరుమైదానంలో కాకుండా  రాజీవ్ చౌక్, వైఎస్‌ఆర్ చౌక్ ప్రధాన రహదారికి ఇరువైపులా కోళ్లు క్రయ విక్రయాలు, పండ్ల వ్యాపారులు తోపుడు బండ్లపై అమ్మకాలు కొనసాగిస్తుండడంతో ట్రాఫిక్ సమస్య మరింత పెరిగింది. ముఖ్యంగా నాటు కోళ్లు, ఇతర మూగజీవాలు క్రయవిక్రయాలతో ఆ రోడ్డంతా రద్దీగా మారింది. దీంతో సోమవారం వచ్చిందంటే చాలు..రహదారి పై రాకపోకలు సాగించాలంటే వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక్కడ వారాంతపు సంత రోడ్లపై నిర్వహించడంతోనే ఈ సమస్య నెలకొంది. రోడ్లపై సంత నిర్వహించకుండా వినియోగదారులు, ప్రజలు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా వారంతపు సంతకు వచ్చే వర్తకులు, వినియోగదారులకు మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం కూడా లేక అవస్థలు పడుతున్నారు.

వాహనాల పార్కింగ్కు కూడా స్థలం లేకపోవడంతో వినియోగదారులు అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపివేస్తున్నారు. ఏదేమైనా ప్రతీ సోమవారం నిర్వహించే వారసంతను తేరు మైదానంలో నిర్వహించేలా చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులు దృష్టిపెట్టాలని ప్రజలు కోరుతున్నారు.