26-10-2025 07:13:33 PM
* తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
*అచ్చంపేటలో వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో చెంచు గిరిజనుల సామూహిక వివాహాలు
* హాజరైన హైకోర్టు జడ్జి మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
అచ్చంపేట: వివిధ ప్రాంతాలకు చెందిన చెంచు గిరిజన ఆదివాసి జంటలకు ఒకే వేదికపై సామూహిక వివాహాలు నిర్వహించడం ప్రశంసనీయమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో వనవాసి కళ్యాణ పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో 111 చెంచు గిరిజన జంటలకు సామూహిక వివాహాలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా రాష్ట్ర గవర్నర్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. గవర్నర్ తో పాటు హైకోర్టు జడ్జి మాధవి దేవి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆదివాసి కళ్యాణ ఆశ్రమం అఖిల భారత కార్యకారిణి రేఖ నాగర్, ప్రాంత అధ్యక్షులు కాట్రాజు వెంకటయ్య తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
వేడుకను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ.. అడవులను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీలను ఒకే చోట వారి.. సాంప్రదాయ పద్ధతుల్లో ఒకే వేదికపై వివాహాలు జరిపించడం హర్షనీయమని కొనియాడారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు దేవుడి అండ దండలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. సమాజంలో ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి సామాజిక అసమానతలను దూరం చేసే కార్యక్రమాలకు అండదండలు ఉంటాయన అన్నారు. అడవి బిడ్డల వివాహానికి హాజరు కావడం ఆనందంగా ఉందని ఈ ప్రాంత చెంచు గిరిజనులను మరొకసారి కలుస్తానని అన్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ చెంచు గిరిజనుల సామాజిక వివాహ మహోత్సవానికి గవర్నర్ హాజరై ఆశీర్వదించడం అభినందనీయం అన్నారు.
భారతీయ సాంప్రదాయ ప్రకారం ఆదివాసీల వివాహాలు జరిపించిన నిర్వాహకులను అభినందించారు. హైకోర్టు జడ్జ్ టి మాధవిదేవి మాట్లాడుతూ సామూహిక వివాహలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తాను నల్లమలలోని పదర మండలం ఉడిమిళ్ళ గ్రామానికి చెందిన తంగిరాల హనుమంత రెడ్డి కుటుంబమని అన్నారు. నిరుపేదలైన చెంచు గిరిజనులకు తన సహకారం ఎప్పటికీ ఉంటాయని అన్నారు. వివాహం చేసుకున్న ఆదివాసి ఆడ బిడ్డలు తన కూతుర్లు లాంటి వారు అన్నారు. నారాయణపేట జిల్లా అంబత్రేయ క్షేత్రం ఆదిత్య పరాశర స్వామి ఆశీర్వచన ప్రసంగం చేశారు. అంతకుముందు గవర్నర్ కు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆదివాసి కళ్యాణ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఉడతనూరి లింగయ్య, మహిళ ప్రముఖ గుర్రం శంఖులత తదితరులు పాల్గొన్నారు.