20-09-2025 08:06:44 PM
రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వం విద్య సంస్థల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులు, సెక్టోరియల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పూర్వ ప్రాథమిక పాఠశాలల నియామకాలు, ప్రొక్యూర్ మెంట్ కమిటీ ఏర్పాటు, ఎఫ్ఎల్ఎన్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ల్యాబ్ లు, ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమంలో నాటిన మొక్కల వివరాలు ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు.
ఫండమెంటల్ లిటరసీ, న్యూమరసి లో జిల్లాల వారీగా ప్రగతి, జిల్లా పరిషత్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలలో నిర్వహిస్తున్న ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా తరగతులు, లైబ్రరీల నిర్వహణ - ఏర్పాటు, బ్యాండ్ యాక్టివిటీస్, డ్రాప్ బాక్స్ క్లియరెన్స్, యు డైస్, అపార్ స్థాయి, ప్రధానమంత్రి పోషణ్, పర్ఫార్మెన్స్ గ్రేడ్ ఇండికేటర్స్ ఇతర అంశాలపై సమీక్షించారు. ప్రభుత్వం విద్యారంగ బలోపేతానికి అమలు చేస్తున్న కార్యక్రమాలను జిల్లా, మండల, గ్రామస్థాయిలలో పకడ్బందీగా చేపట్టాలని, ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా విద్యారంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని తెలిపారు.
జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ భవన సముదాయం నుండి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి దీపక్ తివారి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ ఇతర కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ అధికారుల సమన్వయంతో ప్రతి పాఠశాలలో అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను నిరంతరం సందర్శించి పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు, పాఠశాలలో నెలకొన్న సమస్యలపై పర్యవేక్షించి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.