గండిగూడెం చెరువు అభివృద్ధికి చర్యలు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్ పూర్, జూన్ 9 : అమీన్ పూర్ డివిజన్ పరిధిలోని గండిగూడెం చెరువులోకి కాలుష్య జలాలు చేరకుండా ప్రత్యేక కాలువ నిర్మించనున్నట్లు పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం గండిగూడెం చెరువులో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ప్రధానంగా చెరువు అలుగు పెంచడం మూలంగా సమీపంలోని ఖాజిపల్లి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వర్షాకాలంలో నీటిమట్టం పెరిగి ఇళ్ళలోకి నీళ్లు చేరుతున్నాయని ఇటీవల ప్రజలు తన దృష్టికి తీసుకొని రావడం జరిగిందని పేర్కొన్నారు. అలుగు మట్టాన్ని పూర్వస్థితికి తీసుకుని రావడంతో పాటు.. పరిశ్రమల నుండి కాలుష్య జలాలు చెరువులోకి చేరకుండా చెరువు సమీపం నుండి ప్రత్యేక కాలువ నిర్మించి వాటిని బయటకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, రాజు, గణేష్, నవీన్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.






