19 March, 2026 | 12:03 AM

వినియోగదారుడికి సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలి

18-03-2026 12:00 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, మార్చి 17 ( విజయక్రాంతి ) : ప్రజలకు గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అవసరం ఉన్న ప్రతి వినియోగదారుడికి సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లాలో గ్యాస్ సిలిండర్ సరఫరా మరియు పెండింగ్ కస్టమ్ మిల్లింగ్ రైస్ రికవరీ అంశాలపై పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సివిల్ సప్లై అధికారులకు కీలక సూచనలు చేశారు.

జిల్లాలో గ్యాస్ కొరత ఏ విధంగానూ లేదని, ప్రజలకు గ్యాస్ సిలిండర్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రతి వినియోగదారుడికి సమయానికి సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా, రైస్ మిల్లర్ల వద్ద పెండింగ్లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యం రికవరీని క్రమం తప్పకుండా చేపట్టాలని సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సమయానుకూలంగా బియ్యం వసూలు చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కాశీ విశ్వనాథ్, పౌరసరఫరాల డిఎం, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.