అంతా గప్చుప్.. నేటితో మైకులు బంద్
నేడు సాయంత్రం 6 గంటల నుంచి
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం బంద్
రెండు నెలలుగా అభ్యర్థుల హోరాహోరీ
తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన జాతీయ పార్టీలు
14 సీట్లలో పాగా వేయాలని హస్తం నేతల పట్టు
డబుల్ డిజిట్ దాటాలని బీజేపీ యత్నం
బస్సుయాత్రతో జనంలోకి వెళ్లిన కేసీఆర్
రిజర్వేషన్ల అంశాన్నే ప్రాధాన్యంగా తీసుకున్న నేతలు
బీఆర్ఎస్ గెలిస్తేనే రాష్ట్రం సేఫ్ అని కేసీఆర్ ప్రచారం
హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 6 గంటలకు తెరపడనుంది. పోలింగ్ తేదీకి 32 గంటల ముందే ప్రచార రథాలు, మైక్లు బంద్ కానున్నాయి. ఎన్నికల్లో విజయం కోసం గత రెండు నెలలుగా ప్రధాన పార్టీలతో పాటు స్వతంర్ అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు.
బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో పాటు ప్రచార రథాల్లోనూ ప్రజల్లోకి వెళ్లారు. ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలతో హోరెత్తిన రాష్ట్రం నేటి సాయంత్రం నుంచి మూగబోనున్నది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన అధినేతలు, అగ్రనేతలు తమ అభ్యర్థుల కోసం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సార్వత్రికంలో గెలుపు బీఆర్ఎస్కు అనివార్యమైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రతో పాటు కేటీఆర్, హరీశ్రావు రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేశారు.
తుక్కుగూడ నుంచి కాంగ్రెస్..
ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరిగిన జనజాతర సభతో ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టింది. రాష్ట్రంలో కనీసం 14 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మొత్తం 27 రోజుల్లో 57 సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. రోజుకు రెండు నుంచి నాలుగు సభలను నిర్వహించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ కూడా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ధీటుగా ప్రచార సభలు నిర్వహించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై పదునైన విమర్శలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
రిజర్వేషన్ల చుట్టే చర్చంతా..
కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్పుతో పాటు రిజర్వేషన్లు రద్దు చేస్తారని రేవంత్రెడ్డి చేసిన ప్రసంగాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. దీంతో ప్రధాని మోదీతో పాటు అమిత్షా, ఇతర బీజేపీ నేతలు వివరాలు ఇచ్చుకునే పరిస్థితికి తీసుకొచ్చారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఆరోపించారు. నిధులు, అభివృద్ధి పనులకు అనుమతులు, ప్రాజెక్టులకు జాతీయ హోదా, ఉన్నత విద్యాసంస్థల స్థాపనలో నిర్లక్ష్యం చేశారని బలంగా ఎత్తి చూపారు.
అదేవిధంగా రాష్ట్రానికి బీజేపీ ‘గాడిద గుడ్డు’ ఇచ్చిందనే ప్రచారం ప్రజల్లోకి వెళ్లే విధంగా చేశారు. ఇక బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందని, అవినీతి, నిధుల దుర్వినియోగం తదితర అంశాలను రేవంత్రెడ్డి ప్రస్తావించారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీతోనే పోటీ ఉందని, బీఆర్ఎస్పై ఎక్కువగా ఫోకస్ పెట్టలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణపై బీజేపీ ప్రత్యేక ఫోకస్..
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. 4 సిట్టింగ్ స్థానాలతో పాటు మరో ఐదారు సీట్లలో విజయం సాధించాలనే పట్టుదలతో ముమ్మర ప్రచారం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రి అమిత్షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తెలంగాణపై ఎక్కువగా దృష్టి సారించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ స్కాములు మొదలవుతాయని చెబుతూనే.. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలను మోదీ, అమిత్షాలు తిప్పికొట్టారు.
మతపరమైన ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచుతామని వివరించారు. ఎన్నకల ప్రచారంలో భాగంగా రాష్ట్రానికి నాలుగు సార్లు మోదీ వచ్చారు. ఇక అమిత్షా సిద్దిపేట, చార్మినార్, సిర్పూర్కాగజ్నగర్, నిజామాబాద్, పెద్దపల్లి, భువనగిరి తదితర ప్రాంతాల్లో నిర్వహించిన సభలు, కార్నర్ మీటింగ్లకు హాజరై పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ సెంటిమెంట్తో బీఆర్ఎస్..
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మరోసారి తెలంగాణ సెంట్మెంట్ను బీఆర్ఎస్ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. పార్టీ అభ్యర్థుల విజయం కోసం మాజీ కేసీఆర్ బస్సుయాత్ర చేపట్టారు. 12 సీట్లలో బీఆర్ఎస్ను గెలిపిస్తేనే రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించడానికి అవకాశం ఉంటుందని ప్రజలకు వివరించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందని విమర్శలు చేశారు. కాంగ్రెస్ రాకతో రాష్ట్రంలో నీళ్లు, కరెంట్ సమస్యలు మొదలయ్యాయని ఆరోపించారు.






