calender_icon.png 20 June, 2025 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆత్మీయతా స్మృతులు

08-06-2025 12:00:00 AM

నేడు డా॥ దేవులపల్లి రామానుజరావు వర్ధంతి

ఆచార్య ఎస్వీ రామారావు :

* రామానుజరావు గదిలో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, మరుపూరి కోదండరామిరెడ్డి, గడియారం శేషశాస్త్రి మున్నగు మహానుభావులను దర్శించి, సంభాషించే అదృష్టం  దక్కింది.

దేవులపల్లి రామానుజరావు సారస్వత సాంస్కృతికమూర్తిగా నాకు ఎంత సుపరిచితులో, వ్యక్తిగతంగా అంత ఆత్మీయులు. ఆ ఆత్మీయత వల్లనే వారి కుటుంబంతో బాంధవ్యం కూడా ఏర్పడింది. నారాయణగూడ న్యూసైన్స్ కాలేజీ వెనుక భవనంలో ఉంటున్న రామానుజరావు మా కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన విందు భోజనం నాకు బాగా గుర్తుంది.

నేను పుట్టి పెరిగిన వనపర్తి సంస్థానంతో కూడా రామానుజ రావుకి గాఢమైన అనుబంధం ఉంది. సురవరం ప్రతాపరెడ్డి గోలకొండ పత్రిక నుంచి తప్పుకొన్నాక (1947), అది వనపర్తి రాజా రామేశ్వరరావు యాజమాన్యంలోకి వ చ్చింది. ఆయన బంధువులైన నూకల నరోత్తమరెడ్డి పత్రిక సంపాదకులుగానే కాక పరిషత్తు అధ్యక్షులుగానూ కొనసాగారు. నూకలతో ఉన్న స్నేహం వల్ల కొంతకాలం రామానుజరావుయే గోలకొండ పత్రిక సంపాదకీయాలు రాసేవారు.

రాజాగారి విందులో..

రాజా రామేశ్వరరావుకు సంతానం లేకపోవడం వల్ల కృష్ణదేవరావును (నారాయ ణగూడలోని ఓరియంట్ లాంగ్మ న్స్ ప్రచురణ సంస్థ యజమాని) దత్తత తీసుకొని మా స్వగ్రామం శ్రీరంగాపురంలోని రంగనాయక స్వామి క్షేత్రంలో దత్తత స్వీకార ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ మొ॥ దూర ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు అసంఖ్యాకమైన కార్లలో ఈ కార్యక్రమానికి విచ్చేశారు.

అలా వచ్చిన వారిలో నాకు ఆప్తులైన రామానుజరావు, మాజీ కేంద్రమంత్రి ఎస్. జయపాల్‌రెడ్డి (నిజాం కళాశాలలో నా సహాధ్యాయి) కూడా ఉన్నారు. ఉత్స వం చూద్దామని గుడికి వెళ్లితే వారిరువురూ నాకు ఎదురుపడి ‘మీ ఇల్లు చూద్దా మని’ మా ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించారు. తర్వాత నేను వారి కారులోనే వనప ర్తి వెళ్లి రాజభవనం ఆవరణలో ఏర్పాటుచేసిన రాజాగారి విందులో పాల్గొని తిరిగి వచ్చాను.

రాజా రామేశ్వరరావు తమ ప్యాలెస్‌లోని గ్రంథాలయ భాండాగారాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్తుకు విరాళంగా ఇచ్చారు. రామానుజరావుకి వనపర్తి రాజాగారితోగల అనుబంధం వల్ల వారి శతజయంతి ఉత్సవాలు నూత్నంగా ఏర్పాటైన వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా జరగటం సముచితమని భావిస్తున్నాను.

వైయక్తికమైన ఈ ఆత్మీయతా స్మృతులను అలా ఉంచితే, సారస్వత పరిషత్తుతో దానికి కార్యదర్శి, అధ్యక్ష పదవుల్లో ఉన్న రామానుజరావుతో నాకు సుమారు ఆరు దశాబ్దాల సారస్వతానుబంధం ఉంది. 1960 ప్రాంతంలో నిజాం కళాశాల విద్యార్థిగా ఉన్నపుడు అంతర్ కళాశాల వ్యాసర చన పోటీలు కాలేజీ సమీపంలోని పరిషత్తు హాలులో జరుగుతుండేవి. వాటిలో నేను పాల్గొని బహుమతులు పొందాను.

పరిషత్తు హాలు వెనుక ఉన్న ఆవరణలో ఏర్పాటైన సాహిత్య అకాడమీ, సారస్వత పరిషత్తు సభలకు తరచుగా వెడుతుండటం వల్ల ఎందరో సాహితీవేత్తల ఉపన్యా సాలు వినే భాగ్యం నాకు లభించింది. రామానుజరావు గదిలో రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, మరుపూరి కోదండరామిరెడ్డి, గడియారం శేషశాస్త్రి మున్నగు మహానుభావులను దర్శించి, సంభాషించే అదృష్టం  దక్కింది.

గడియారం వారివల్లే పరిచయం

రామానుజరావుతో నాకు సన్నిహిత పరిచయం ఏర్పడటానికి కారకులు పరిషత్తు కార్యదర్శిగా ఉన్న గడియారం రామకృష్ణశర్మ. పాలమూరు జిల్లా ప్రసిద్ధ ఆలంపూరు క్షేత్రోద్ధారకులైన శర్మ 1965లో వనపర్తి తాలూకా కేంద్రంగా నేను స్థాపించిన జిల్లా సాహిత్య సమితి ‘జ్యోతిర్మయి’కి ముఖ్య హితవాదిగా ఉండి మా సాహిత్య కార్యక్రమాలను ఎంతో ప్రోత్సహించారు. ఆ సందర్భంలోనే మహాకవి దాశరథితో పరిచయం కలుగటం నా అదృష్ట విశేషం.

ఆ రోజుల్లో సాహిత్య అకాడమీ గుర్తింపు పొందిన సాహిత్య సంస్థల నుంచి ప్రతినిధులుగా నియమితులైన వారు అకాడమీ కార్యవర్గ సభ్యులుగా కొనసాగే అవకాశం ఉండేది. రామానుజరావు కోరికపై దాశరథిని మా సంస్థ ప్రతినిధిగా ప్రతిపాదించగా ఆయన అకాడమీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైనారు. ఆనాటి నుంచి దాశరథి నన్ను ‘తమ్ముడూ’ అని పిలుస్తూ సోదర ప్రేమను వ్యక్తం చేసేవారు.

1972లో జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ప్రప్రథమంగా మేము నిర్వహించిన పాలమూరు జిల్లా రచయితల మహాసభలకు దేవులపల్లి రామానుజరావు, గురువు సి.నారాయణరెడ్డి మున్నగువారితోపాటు మద్రాసు నుంచి దాశరథి కూడా అతిథులుగా విచ్చేసి సభలను జయప్రదం చేశారు. నాలోని సాహిత్యాభిలాషను, రచన పట్ల ఆసక్తిని గమనించిన రామానుజరావు నిరంతరం నన్ను ప్రోత్సహిస్తూ ఉండేవారు.

ఒకసారి మా గురువు సి. నారాయణరెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి బహుమతి (మంటలూ మానవుడూ) వచ్చినపు డు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ‘వచన కవితా కేతనం’ శీర్షికతో నేను రాసి న వ్యాసం చదివి దగ్గరకు పిలిచి మెచ్చుకొన్నారు.

సినారె పర్యవేక్షణలో ‘తెలుగులో సాహిత్య విమర్శ- అవతరణ వికాసములు’ అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టం పొందిన నా సిద్ధాంత గ్రంథం అచ్చయిన సందర్భంలో (1975) పరిషత్తు పక్షాన నా గ్రంథావిష్కరణ సభకు అధ్యక్షత వహించి సభను నిర్వహించారు.

పరిషత్తుతో గాఢానుబంధం

రామానుజరావు రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా కూడా వ్యవహరించటం వల్ల, రవీంద్రభారతి ప్రాంగణంలోని కళాభవన్‌లో ఉన్న అకాడమీ కార్యాలయానికి కూడ వెళ్లి తరుచుగా కలుస్తుండే వాణ్ణి. బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షులుగా ఉన్న సాహిత్య అకాడమీకి అనుబంధమైన సలహాసంఘంలో సభ్యుడిగా ఉండే అవకాశం (1979--83) కల్పించారు. అంతేకాదు-, వారి ఆశీస్సులతో ఆంధ్రసారస్వత పరిషత్తు కార్యవర్గ సభ్యుడిగా, పరిషత్తు ప్రచురణల సంపాదకుడుగా  కొనసాగుతున్నాను.

పరిషత్తు రజతోత్సవ (1976), స్వర్ణోత్సవ (1994), సప్తత్యుత్సవ (2013) సంచికల్లోనూ, సాహిత్య అకాడమీ రజతోత్సవ సంచిక (తెలుగులో పరిశోధన -1983)లోనూ నా వ్యాసాలు ముద్రిత మైనాయి. రామానుజరావు హ యాంలో ప్రారంభమైన పరిషత్తుతోగల గాఢానుబంధం, పీయూసీ నుంచి పీహెచ్‌డీ వరకు ప్రత్యక్ష గురువైన ఆచార్య సి. నారాయణరెడ్డి అధ్యక్షులుగా ఉన్న తరుణంలో కూడా అలాగే కొనసాగుతున్నది.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించి ప్రగతి పథంలో కొనసాగుతున్న సందర్భంలో తెలంగాణ సాహిత్య సదస్సుల్లో నూ, వ్యాస సంకలనాల్లోనూ ఆసక్తితో పా ల్గొంటున్నాను. నా విమర్శ వ్యాససంపుటి (విమర్శక వతంసులు-2011) వారి సంపాదకత్వంలో పరిష త్తు ప్రచురణగా వెలువ డింది.

సాహితీ చైతన్యమూర్తిగా, సంస్థా నిర్వహణ దక్షులుగా బరంపురం నుంచి చెన్నపురి వరకూ గల తెలుగు సమాజానికి విశిష్ట సేవలు అందించిన దేవులపల్లి రామానుజరావు ప్రతిభా పూర్ణతను ఎంత కొనియాడినా తక్కువే అవుతుంది. 

- ‘తెలంగాణ వైతాళికులు: 

డా॥ దేవులపల్లి రామానుజరావు 

శతజయంతి ప్రత్యేక సంచిక’ 

లోంచి సంక్షిప్తంగా.., ‘ఇంటర్నెట్ 

ఆర్కైవ్’ సౌజన్యంతో..