08-06-2025 12:00:00 AM
కెనడాతో సత్సంబంధాలు నెలకొల్పుకోవాలని అనుకుంటున్న తరుణంలోనే గ్రూప్ ఆఫ్ 7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు భారత్కు ఆహ్వానం అందింది. కెనడా ఆతిథ్యం ఇస్తున్న జీ-7 సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా కెనడా ప్రధాని మార్క్ కార్నె శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించారు. నిజానికి 2019 నుంచి జీ-7 శిఖరాగ్ర సమావేశాలకు ప్రధాని మోదీకి ప్రతిసారి ఆహ్వానం అందుతూనే ఉంది.
జీ-7లో భారత్కు సభ్యత్వం లేదు. ప్రపంచంలోని ప్రధానమైన పారిశ్రామిక దేశాలు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, జపాన్, అమెరికా, కెనడా ఈ కూటమిలో ఉన్నాయి. ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ప్రపంచం గుర్తింపు పొందిన భారత్కు జీ-7 సమున్నత స్థానాన్ని ఇస్తూనే ఉంది. భారత్తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగు పర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న మార్క్ కార్నె, జీ-7 సమ్మిట్ సందర్భాన్ని అర్థవంతంగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు.
2023 జూన్లో ఖలిస్థాన్ వేర్పాటు వాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య తర్వాత భారత్, కెనడా మధ్య అంతరాలు పెరిగాయి. నిజ్జార్ను కెనడా గడ్డపై భారత్ చంపించిందని అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్యూడో చేసిన తీవ్ర ఆరోపణను భారత్ గర్హించింది. సిక్కు వేర్పాటువాదులకు నిలయంగా మారిన కెనడాలో ఎన్నికల అనంతరం పరిస్థితులు మారాయి.
ట్రూడో స్థానంలో దేశ ప్రధాని అయిన మార్క్ కార్నె ఇప్పుడు భారత్ ప్రధానిని కెనడాకు ఆహ్వానించడం అక్కడి కొన్ని సిక్కు గ్రూపులకు మింగుడు పడటం లేదు. నిజ్జార్ హత్య తర్వాత రెండు దేశాలు దౌత్యవేత్తలను వెనుకకు పంపించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిజ్జార్ హత్యతో సంబంధం ఉందని నలుగురు భారతీయ సంతతి వారిని కెనడా పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఇప్పుడు ఆ అంశం కోర్టులో ఉంది.
జూన్ 15 నుంచి 17వ తేదీ మధ్య జరుగనున్న జీ-7 శిఖరాగ్ర సమావేశాలలో ప్రపంచ శాంతి, భద్రతలు ప్రధానంగా చర్చనీయాంశాలు కానున్నాయి. ప్రపంచ ఆర్థిక సుస్థిరత, కృత్రిమ మేధను వివిధ రంగాల్లో ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై చర్చలు జరుగనున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యల వల్ల భారత్ ఎదుర్కొంటున్న సమస్యలు, పహల్గాం ఉగ్రదాడి..
తదనంతర పరిణామాలను ప్రధాని మోదీ జీ-7 సమ్మిట్లో ఆయా దేశాధినేతలకు వివరించవచ్చు. పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను వారికి విడమరిచి చెప్పడానికి ఇది మంచి అవకాశం. ఖలిస్థాన్ వేర్పాటువాదులకు మద్దతును ఇస్తున్నట్లుగా సాగిన ట్రూడో పాలనకు, తన పాలనకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని కార్నె, జీ- 7 సమ్మిట్కు మోదీని ఆహ్వానించడం ద్వారా స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు.
స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ట్రూడో అనుసరించిన విధానానికి తను దూరంగా వున్నట్టు కార్నె సందేశం ఇచ్చినట్లయింది.