08-06-2025 12:00:00 AM
ఆర్.విశ్వేశ్వర్రావు :
* పహల్గాంలో సాధారణ పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయా అని ఎదురుచూడటం తప్ప స్థానికులకు గత్యంతరం కనిపించడం లేదు.
ఎంతో కష్టపడి ఒక అడుగు ముందుకు వేస్తే కలిసి రాని కాలం పదడుగులు వెనక్కి తోసినట్టుంది కశ్మీర్ అభివృద్ధి పరిస్థితి. ఉగ్రవాదుల పు ణ్యమా అని అక్కడి సామాన్య ప్రజల అవస్థలు ‘కక్కలేక, మింగలేక’ అన్నట్టుగానే ఉ న్నాయి. అత్యంత దుర్మార్గమైన పహల్గామ్ దాడి తర్వాత కశ్మీర్లో కొత్త సంక్షోభం తలెత్తుతోంది. అదే పర్యాటక వినాశనం. ఏప్రిల్ 22, 2025న పహల్గాంలోని బైసరన్ లోయలో అమాయక పర్యాటకులపై దుర్మార్గపూరితమైన దాడి జరిగింది.
ఫలితంగా 26 మంది అత్యంత విషాదకరంగా ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే, ఆ ప్రాంతంలో గణనీయమైన అశాంతి నెలకొంది. ఉగ్రవాదులుగా అనుమానిస్తున్న వారి ఇళ్లను అధికారులు కూల్చివేశారు. చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. కశ్మీర్లోని 87 పర్యాటక ప్రదేశాలలో 48 ప్ర దేశాల సందర్శనలను కూడా నిషేధించారు.
పర్యాటక రంగంపై ఎక్కువగా ఆధారపడిన ఈ ప్రాంతంలో స్థానిక ఆర్థిక వ్యవస్థను ఇది తీవ్రంగా ప్రభావితం చేసిం ది. దాడి తర్వాత కొన్ని వారాల నుంచి హోటళ్ళు, విమానాల రద్దు గణనీయంగా పెరిగాయి. చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. వేరే మార్గం లేకపోవడంతో చాలా హోటళ్ళు తమ సిబ్బం దిని తొలగించాల్సి వచ్చింది. వీరిలో చాలామంది కశ్మీర్లోని చిన్న పట్టణాల నుంచి వలస వచ్చినవారు.
వాళ్ల ఆటలు సాగకూడదు!
కాగా, తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్లోని చినాబ్ వంతెనను ప్రారంభిస్తూ, అభివృద్ధిని ఉగ్రవాదులు ఎంతగా దెబ్బతీయాలని చూసినా ఆపేది లేదని స్ప ష్టం చేశారు. కశ్మీర్ ప్రజలకు జీవనాధారమైన పర్యాటకాన్ని పాకిస్థాన్ లక్ష్యంగా చేసుకుందని ప్రధాని మోదీ అన్నారు. పాకిస్థాన్ కుట్రకు వ్యతిరేకంగా జమ్మూ కశ్మీర్ ప్రజలు నిలబడిన విధానాన్ని ఆయన ఈ సందర్బంగా అభినందించారు.
“ఈసారి కశ్మీర్ ప్రజలు చూపిన బలం పాకిస్తాన్కు మాత్రమే కాక యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదానికి స్పష్టమైన సందేశాన్ని పంపినట్టయ్యిందని” ప్రధాని మోదీ పేర్కొన్నా రు. జమ్మూ కశ్మీర్ యువత ఇప్పుడు ఉగ్రవాదానికి తగిన సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
సాహసయాత్రకు ప్రారంభ ప్రదేశం
ఉత్తర భారతదేశంలోని జమ్మూ కశ్మీర్కు చెందిన అనంత్నాగ్ జిల్లాలోని పట్టణమే పహల్గాం. అనంతనాగ్ నగరానికి 45 కి.మీ. దూరంలో, లిడ్డర్ లోయ లో, లిడ్డర్ నది ఒడ్డున, హిమాలయాలలో సముద్రానికి సుమారు 7,200 అడుగుల ఎత్తులో ఉంది. పహల్గాం ప్రసిద్ధ పర్యాటక కేంద్రమేకాక హిల్ స్టేషన్ కూడా. ఇది హిందువులు అత్యంత పవిత్రంగా భావిం చి, ప్రతీ ఏడూ జరిపే సాహసోపేత యాత్ర అమర్నాథ్కు ప్రారంభ స్థానం.
ప్రతీ సంవత్సరం ప్రపంచం నలుమూలల నుం చి వేలాదిమంది పర్యాటకులు పహల్గాంకు వస్తుంటారు. 2025లో పహల్గాం ఉగ్రదాడి జరిగిన నాటినుంచి ఇక్కడ పర్యాటకం పెద్ద ఎత్తున మూలకు పడింది. ‘పహ ల్గామ్’ అనే పేరు కశ్మీరీ పదాల నుంచి వచ్చింది. ‘పుహేల్’ అంటే ‘గొర్రెల కాపరి’, ‘గోమ్’ అంటే ‘గ్రామం’ అని అర్థం. ఇది కాలక్రమేణా పుహెల్గోమ్గా, పహల్గామ్గా మారింది. ఈ పట్టణ ప్రదేశం చుట్టుపక్కల అనేక పచ్చిక బయళ్లు ఆకర్షణీయంగా యాత్రికులకు కనువిందు చేస్తుంటాయి.
ఇక్కడ బఖర్వాల్ ప్రజలు వేసవికాలం నుం చి చలికాలం ప్రారంభం వరకు వారి పశువులను మేపుకుంటూ తాత్కాలిక నివాసం ఏర్పరచుకుంటారు. హిందూ సంప్రదాయాల ప్రకారం పహల్గామ్ను మొదట బై ల్గావ్ (ఎద్దుల గ్రామం) అని పిలిచేవారు. అమర్నాథ్ గుహలోకి ప్రవేశించే ముందు శివుడు, నందిని ఇక్కడే విడిచి పెట్టాడని ఒక పురాణ కథనం ప్రచారంలో ఉంది.
రద్దవుతున్న యాత్రికుల బుకింగ్లు
స్థానికంగా పత్రికల వారికి అందిన సమాచారం ఇలా ఉంది. శ్రీనగర్లోని ఒక హోటల్ యజమాని షోకెట్ అహ్మద్ మాట్లాడుతూ, దాడి జరిగినప్పటి నుంచి బుకింగ్లు జరగలేదని, మొత్తం 26 గదులు ఖాళీగా ఉన్నాయని నివేదించారు. అతను ముందస్తు చెల్లింపులను తిరిగి చెల్లించారు. ఆర్థిక పరిమితుల కారణంగా తన 15 మంది సిబ్బందిలో ముగ్గురిని మాత్రమే కొనసాగిస్తున్నారు.
షోకెట్కు సుమారు రూ. 10 లక్షల మేర నష్టా లు సంభవించగా, ఇంకా కొనసాగుతున్న ఖర్చులు ఉన్నాయి. కానీ, ఆదాయం మా త్రం లేదు. బారాములా జిల్లాలోని పల్హల్లన్ గ్రామానికి చెందిన వలస కార్మికుడు, శ్రీనగర్కు చెందిన జకురాలోని ఒక హోట ల్లో మాజీ హౌస్కీపర్ అయిన ఇర్ఫాన్ లోన్ దాడి తర్వాత కొద్దిసేపటికే తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. “నేను నిస్సహాయుణ్నయ్యాను” అని బాధతో అన్నాడు.
శ్రీనగర్లోని ఖన్యార్లోని ఒక హోటల్లో వె యిటర్గా పనిచేస్తున్న ఇంతియాజ్ ఆహ్, ఆ ప్రాంతంలో పర్యాటకులు తగ్గుముఖం పట్టడంతో తన ఉద్యోగాన్ని ఎలా వదిలివేయమని అడిగారో చెప్పుకొచ్చాడు. తన కుటుంబంలో ఏకైక జీవనాధారమైన ఇంతియాజ్ ఈ సవాలుతో కూడిన సమయంలో వారికి ఆహారం అందించడానికి పడరాని కష్టాలు పడుతున్నాడు.
ప్రధాన ఆదాయ వనరుకు ఆటంకం
పర్యాటక పరంగా సమస్యలను ఎదుర్కొంటున్నది ఒక్క హోటల్ కార్మికులు మాత్రమే కాదు. సోనామార్గ్కు చెందిన మహ్మద్ ఆరిఫ్ పర్యాటకుల కోసం గుర్రపు స్వారీలు నిర్వహిస్తాడు. “నేను సాధారణంగా పర్యాటకులను గుర్రంపై పచ్చిక బయళ్ల గుండా తీసుకెళుతుంటా ను. దీనిద్వారా రోజుకు 2,000 రూపాయలు సంపాదిస్తాను. కానీ, ఇప్పుడు నాకు చేసుకోవడానికి ఆ పని లేదు. ఇంట్లోనే ఖాళీగా కూర్చోవాల్సి వస్తున్నది” అని అతను వాపోయాడు.
శ్రీనగర్లోని మొఘల్ గార్డెన్స్కు దారితీసే బౌలేవార్డ్ రోడ్డులో వీధి వ్యాపారి అయిన షానవాజ్, దాల్ సరస్సు దగ్గర కస్టమర్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. “నేను ఇక్కడ గత 10 సంవత్సరాలుగా ఫలూడా ఐస్ క్రీం అమ్ముతున్నాను. ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. గతంలో రోజుకు సుమారు 3,000 రూపాయలు సంపాదించే వాడిని, ఇప్పుడు 500 రూపాయ లు మాత్రమే సంపాదిస్తున్నాను.
పాఠశాల ఫీజులు, నా పిల్లలకు ట్యూషన్స్ ఫీజులు సహా ఇంటి ఖర్చులను నిర్వహించడం కష్టంగా ఉంది. నా కుటుంబంలో ఆరుగు రు సభ్యులు ఉన్నారు. ఈ 500 రూపాయలతో ఎలా బతికేది?” అంటున్నాడత ను.“కశ్మీర్ సురక్షితంగా, అందంగా ఉన్నందున పర్యాటకులు వచ్చి సందర్శించాలని నేను అభ్యర్థించాలనుకుంటున్నాను. కానీ నా అభ్యర్థన ఎంతవరకు వెళ్తుందో నాకే ఆశ్చర్యంగా ఉంది” అని ఆయన అన్నాడు.
అందరి కళ్లూ పహల్గాం పైనే!
భారతదేశంలో, విదేశాలలో కూడా అతిథుల నుంచి యాత్రల రద్దులు జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని షికారా, హౌస్బోట్ యజమానులు తాము ఎదుర్కొంటున్న అనిశ్చితిని వారు హైలైట్ చేశారు. “మేం పర్యాటక రంగంపై ఆధార పడతాం” అని అన్నారు. ఏదేమై నా, పహల్గాంలో జరిగిన దాడి కశ్మీర్లోని అనేక మంది వ్యక్తులు, కుటుంబాల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేకించి సుందరమైన పహల్గాం పట్టణంలో సాధారణ పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయా అని స్థానికులు ఎదురు చూడటం తప్ప వారికి మరో గత్యంతరం కనిపించడం లేదు. త్వరలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర పహల్గాం నుండే ప్రారంభ మవుతుంది.
అయితే, ఉగ్రవాదుల భయాందోళనలకు అతీతంగా దేశంలోని ఆయా ప్రాంతాలకు చెందిన వేలసంఖ్యలో భక్తులు ఆ ప్రదేశాన్ని సందర్శించడానికి నమోదు చేసుకున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ‘ఆపరేషన్ శివ’ పేరుతో అమర్నాథ్ యాత్రికుల కోసం భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.