23 June, 2026 | 6:36 PM

రైతువేదికల్లో ఘనంగా విత్తన మేళాలు

23-06-2026 05:35 PM

- రైతులకు విత్తనాలు, పంటల ప్రణాళికపై అవగాహన

గజ్వేల్,జగదేవపూర్: వానాకాలం –2026 సాగు సీజన్‌ను పురస్కరించుకుని రైతులకు నాణ్యమైన విత్తనాల ఎంపిక, పంటల ప్రణాళిక, ప్రభుత్వ సూచనలపై అవగాహన కల్పించేందుకు గజ్వేల్ డివిజన్ పరిధిలోని గజ్వేల్, కొండపాక, కుకునూర్‌పల్లి, రాయపోల్ మండలాల రైతు వేదికల్లో ప్రభుత్వం ఆదేశాల మేరకు ఘనంగా విత్తన మేళాలు నిర్వహించారు. గజ్వేల్ రైతు వేదికలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ ఎడిఏ బాబు నాయక్ చేతుల మీదుగా విత్తన మేళను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయా రైతు వేదికల్లో వ్యవసాయ అధికారులు రైతులకు తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్–15048), బీపీటీ–5204, హెచ్‌ఎమ్‌టీ సోనా, జై శ్రీరాం, డబ్ల్యూజీఎల్–44, కెఎన్‌ఎమ్–1638, కెఎన్‌ఎమ్–7715 వంటి ఏడు రకాల సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ అందిస్తోందని అధికారులు వివరించారు. అలాగే కంది, పెసర, వివిధ కూరగాయల విత్తనాలు, నానో యూరియా, నానో డీఏపీ రైతులకు అందుబాటులో ఉంచారు.

అవసరమైన రైతులు వీటిని కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు. అలాగే మునిగడప, జగదేవపూర్, బస్వాపూర్, చాట్లపల్లి రైతు వేదికల్లో ఏడిఏ అనిల్ కుమార్, ఏవో వసంతరావు  ఖరీఫ్–2026 సీజన్‌లో సాగు చేయదగిన పంటలు, విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటల నమోదు (క్రాప్ బుకింగ్), నానో యూరియా, నానో డీఏపీ వినియోగం, ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. మేళాలో ఏర్పాటు చేసిన వివిధ విత్తనాల స్టాల్స్ రైతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావం గురించి కూడా రైతులకు వివరించారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తక్కువ కాల వ్యవధిలో దిగుబడులు ఇచ్చే పంటల విత్తనాలను కూడా మేళాలో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఆయా గ్రామాల సర్పంచులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.