మెనూ ప్రకారమే మధ్యాహ్న భోజనం వండాలి
జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ లు యస్. కె. సైదులు, ఎన్. సతీష్ కుమార్
పాల్వంచ,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారం, నాణ్యమైన ఆహరాన్ని విద్యార్థులకు అందించాలని జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్ లు ఎస్కె సైదులు, ఎన్.సతీష్ కుమార్ లు వంట ఏజెన్సీలకు సూచించారు. బుధవారం కొత్తగూడెం మండలం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, రామవరం లను సందర్శించినారు. ఈ సందర్బంగా మధ్యాహ్న భోజన అమలును పరిశీలన చేశారు. మెనూ ప్రకారం వంట ఏర్పాటు చేయకపోవడంపై ప్రధానోపాధ్యాయులను, వంట ఏజెన్సీ వారిని వివరణ అడిగినారు.
ఎట్టి పరిస్థితులలో మధ్యాహ్న భోజనాన్ని మెనూ ప్రకారమే ఏర్పాటు చేయాలని, నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు. ఉన్నత పాఠశాలలో స్వచ్ఛత 5.0 క్యాంపెయిన్ లో భాగంగా డిస్పోస్ చేసిన పనికిరాని కంప్యూటర్లు మరియు స్క్రాప్ వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్శనలో మండల విద్యాధికారి మధురవాణి, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.




