‘స్వచ్ఛ ధర్మపురి.. స్వచ్ఛ గోదావరి..’ లక్ష్యంగా ముందుకు..
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): గోదావరి నది పవిత్రతను కాపాడలనే లక్ష్యంతో ’స్వచ్ఛ ధర్మపురి.. స్వచ్ఛ గోదావరి..’ కార్యక్రమాన్ని తీసుకున్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ధర్మపురి మున్సిపాలిటీకి కొత్తగా ఎన్నికైన పాలకవర్గం ఆధ్వర్యంలో ’స్వచ్ఛ ధర్మపురి.. స్వచ్ఛ గోదావరి..’ కార్యక్రమాన్ని మంగళవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి గోదావరి తీరంలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి నది స్వచ్ఛతను కాపాడడానికి పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. భక్తులు తమ వెంట తీసుకువచ్చిన పాత బట్టలు, ఇతర వస్తువులు సూచించిన ప్రదేశాల్లో వేయాలని, గోదావరి నీటిలో వేయడం వలన నది కలుషితం అవుతుందని అన్నారు. 2027 జూన్ లో జరిగే గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుండి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇందులో భాగంగా ధర్మపురిలో చేపట్టే అభివృద్ధి పనుల అంచనాలు తయారు చేయడానికి ఈనెల 27న ప్రభుత్వం నియమించిన కన్సల్టెన్సీ ప్రతినిధులు వస్తున్నారని మంత్రి తెలిపారు. ధర్మపురి పట్టణ ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ధర్మపురి బ్రాహ్మణులు, అగ్రహారం పెద్దలు తమ అమూల్యమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. ధర్మపురి పట్టణంలో మిగిలి ఉన్న డ్రైనేజీ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ధర్మపురి లోని డంపింగ్ యార్డ్ సమస్యకు ఒక పరిష్కారం త్వరలోనే చూపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, ధర్మపురి ఆలయ కమిటీ చైర్మన్ జక్కు రవీందర్, మున్సిపల్ కమిషనర్, ధర్మపురి తహసీల్దార్, తదితరులు పాల్గొన్నారు.




