13-09-2025 03:31:29 PM
ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు..
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): పురుషులతో పాటు, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ కాలనీ సమీపంలో ఇందిరా మహిళ శక్తి కార్యక్రమంలో భాగంగా జిల్లా మహిళా సమాఖ్య, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 5 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేయనున్న మహిళా శక్తి పెట్రోల్ పంపు పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ముందుకొస్తున్నారని, తాను 2004 సంవత్సరంలో శాసనసభ్యులుగా ఉన్న సమయంలో ఒక్కో గ్రామంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు 15 కోట్ల వరకు రుణాలు ఇప్పించడం జరిగిందని మంత్రి గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని, అన్ని పథకాల లబ్ధిని మహిళలకి ఇస్తున్నదని, ముఖ్యంగా ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం వంటివి ఉదాహరణగా చెప్పారు.
మహిళా సంఘాల సభ్యులు కలిసికట్టుగా పని చేసుకోవాలని కోరారు. ఎస్ఎల్బీసీ వద్ద ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంక్ భవిష్యత్తులో బాగా నడుస్తుందని, మెడికల్ కళాశాల పక్కనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల, నర్సింగ్ కళాశాల, ఇటు హైదరాబాద్ రహదారికి, నాగార్జునసాగర్ రహదారికి చేరువలో ఉండటం, పెట్రోల్ పంపుతో పాటు, ఏవి చార్జింగ్ మిషన్, కేఫ్ టేరియా, సూపర్ మార్కెట్ వంటివి ఇక్కడ బాగా నడుస్తాయని అన్నారు. సెర్ప్ సిఈఓ దివ్యా దేవరాజన్(SERP CEO Divya Devarajan) మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయ సంఘాలకు 20వేల కోట్ల రూపాయల రుణాలు ఇస్తున్నామని, చిన్న సంఘాల ద్వారానే మహిళల్లో ధైర్యం వస్తుందని, ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే మహిళ ముందడుగు వేస్తుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని స్వయం సహాయక మహిళా సంఘాలలోని సభ్యులకు ప్రతి ఇంటికి రుణం వెళ్లే విధంగా చూడాలని అన్నారు.
పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే బాధ్యతలను మహిళలకు అప్పగించగా, రాష్ట్రవ్యాప్తంగా 30 కోట్ల ఆదాయం వస్తే నల్గొండ జిల్లాలో కోటీ 40 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ధాన్యం కొనుగోలులో సైతం 80 కోట్ల రూపాయల ఆదాయాన్ని స్వయం సహాయక మహిళా సంఘాలు రాష్ట్రంలో ఆదాయం అర్జించారని, ప్రభుత్వము మహిళల కోసం ప్రవేశపెడుతున్న పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీంతో పాటు ఆరోగ్యం, పిల్లల చదువు, పౌష్టికాహారం అందించాలని, గ్రామాలలో గృహహింసకు వ్యతిరేకంగా మహిళలకు తోడుగా నిలవాలని, ఆరోగ్యం, సామాజిక భద్రత చూసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, ఐ ఓ సి ఎల్ జనరల్ మేనేజర్ సుదీప్ రాయ్, డిఆర్డిఏ పిడి శేఖర్ రెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, రెవెన్యూ అదనపుకలెక్టర్. జె. శ్రీనివాస్, ఇన్చార్జి డిఆర్ఓ అశోక్ రెడ్డి ,మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్ ,డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి ,ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ,ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి ఫిష్ ఔట్లెట్ ను ప్రారంభించారు.