హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు(Local Bodies Election) ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఆదివారం ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కేవలం 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, అంతర్గత విభేదాలను పక్కనపెట్టి పార్టీ విజయం కోసం ఐక్యంగా పనిచేయాలని మంత్రి పొంగులేటి(Minister Ponguleti) కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు. ఖమ్మంలో పలైర్ నియోజకవర్గం(Palair Constituency) నుండి కాంగ్రెస్ నాయకుల సమావేశంలో మంత్రి పొంగులేటి ప్రసంగించారు.
రేపు కేబినెట్ లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామన్నారు. స్థానికఎన్నికలు దశలవారీగా జరుగుతాయని సూచించారు. తొలుత ఎంపీటీసీ(Mandal Parishad Territorial Constituency), జడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత సర్పంచ్(Sarpanch Elections), మున్సిపల్ ఎన్నకలు నిర్వహించనున్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కోరారు. రిజర్వేషన్ ప్రమాణాలు, గెలుపు అవకాశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేని ఆయన తేల్చిచెప్పారు. వారం రోజుల్లోనే రైతు భరోసా, సన్నాలకు బోనస్ రైతుల ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.