07-08-2024 08:16:57 PM
హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ ను రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలిశారు. ఖమ్మం-వరంగల్ మీదుగా దక్షిణ మద్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేయనున్న రైలు మార్గాల్లోని అలైన్ మెంట్ లో మార్పులు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు బుదవారం రైల్ నిలయంలో జీఎం అరుణ్ కుమార్ జైన్ తో మంత్రి సమావేశం అయ్యారు. డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయక్ గూడెం మీదుగా సూర్యపేట జిల్లా మోతే నుండి గద్వాల్ వరకు ప్రతిపాదించిన నూతన రైల్వే మార్గం ఖమ్మం జిల్లాలోని తన నియోజకవర్గం పాలేరులోని నాలుగు మండల మీదుగా ఈ రైల్వే మార్గం వెళ్తుంది. దీంతో రైతులు సాగు భూమలను కోల్పోవలసి వస్తుందని, దీనికి ప్రత్యామ్నాయంగా అలైన్ మెంట్ లో మార్పులు చేసి మరో మార్గములో రైల్వేలైన్ ను ఏర్పాటు చేయాలని కోరారు.
అదేవిదంగా, కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటి మాస్టర్ ప్లాన్ ను పరిగణలోకి తీసుకొని వరంగల్ నగర బైపాస్ రైల్వేలైన్ ను నిర్మించాలని చెప్పారు. వరంగల్ నగర అభివృద్దికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని 2050కి అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేస్తున్నదన్నారు.
ఈ నేపథ్యంలో రైల్వే శాఖ నష్కల్ నుండి హసన్ పర్తి, నష్కల్ నుండి చింతలపల్లి వరకు కొత్తగా నిర్మించతలపెట్టిన రైల్వే మార్గాన్ని వరంగల్ మాస్టర్ ప్లాన్ కు అనుసందానం చేయాలని కోరారు. ప్రస్తుతం సిద్దం చేసిన రైల్వే మార్గం వల్ల వరంగల్ మాస్టర్ ప్లాన్ దెబ్బతింటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని అలైన్ మెంట్ మార్చాలని జిఎం విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశములో ఆర్.బి. శాఖ, ప్రత్యేక కార్యదర్శి, హరి చందన తదితరులు పాల్గొన్నారు.