మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు
బిజినేపల్లి: మండలంలోని ఆయా గ్రామాల్లో మొక్కజొన్న పంట అగ్ని ప్రమాదానికి గురై రైతును నిలువునా దహిస్తోంది. నందివడ్డెమాన్, అల్లిపూర్ గ్రామాల్లో ఆదివారం పంట దగ్ధం కాగా నేడు ఖానాపూర్, నంది వడ్డెమాన్ గ్రామాల్లో మొక్కజొన్న పంట దగ్ధం అయింది. ఖానాపూర్ గ్రామంలో ఈర్ల లక్ష్మమ్మకు చెందిన ఎకరన్నర మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయింది. నంది వడ్డేమాన్ గ్రామంలో మ్యాతరి ఉషన్నకు చెందిన మొక్కజొన్న పంటను కోసి పొలంలోనే కుప్పగా పోసుకున్నాడు. ఈ రెండు గ్రామాల్లో పక్క పొలం రైతులు తన పొలంలోని పంట అవశేషాలకు నిప్పు పెట్టే క్రమంలో ఇలాంటి ఘటనలో పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వ్యాపించి మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అవుతోంది.
బిజినేపల్లి మండల వ్యాప్తంగా రబీలో 18,000 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేసుకోగా ఇప్పటికే 12 వేల ఎకరాల వరకు పంట చేతికి రాగా మిగిలిన పంట ఇంకా పొలంలోనే ఉంది. పక్క పొలాల రైతులు తమ పంట అవశేషాలను దగ్ధం చేసే క్రమంలో పంట కోతకు సిద్ధంగా ఉన్న రైతులు నష్టపోతున్నారు.
పంట అవశేషాలతోనే ఎరువులు
పంట కోతలో అగ్ని ప్రమాద ఘటనలపై మండల వ్యవసాయాధికారి కమల్ కుమార్ ను సంప్రదించగా మండల వ్యాప్తంగా ఇంకా 4వేల ఎకరాల వరకు పంట కోయాల్సి ఉందన్నారు. 15 రోజుల్లో పంట పూర్తి స్థాయిలో కోతకు వస్తుందని అన్నారు. మొక్కజొన్న ఇతర పంటలను దగ్ధం చేయడం కాకుండా తాము సూచించినట్లుగా చేస్తే తర్వాతి పంటకు ఎరువుగా మారుతుందని అన్నారు. తద్వారా ఖరీఫ్ లో సాగు చేసే పంటలకు తక్కువ మోతాదులో మాత్రమే కృత్రిమ ఎరువులు ఉపయోగించాల్సి ఉంటుందని అన్నారు.






