29 August, 2026 | 5:25 PM

70 ఏండ్ల భూములకు పట్టాలిచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే!

29-08-2026 04:20 PM

నూతనకల్,(విజయక్రాంతి): నాడు దొరల చేతుల్లో బందీ అయిన భూములు.. నేడు ప్రజాపాలనలో నిరుపేదల చేతుల్లో పట్టాలుగా(Ceiling Land Pattas) మారాయి." దశాబ్ద కాలంగా పరిష్కారానికి నోచుకోని సీలింగ్ భూముల సమస్యకు(Ceiling lands issue) మోక్షం లభించడంతో నూతనకల్ మండల రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.శనివారం నూతనకల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy ), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని అర్హులైన రైతులకు, పేదలకు సీలింగ్ భూముల పట్టాలను పంపిణీ చేశారు.

నాటి ​ధరణితో రైతులను... గోసపెట్టారు: మంత్రులు

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ‘ధరణి’ పోర్టల్ పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ధ్వజమెత్తారు.భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి కల్పించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, ఏళ్ల నాటి సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అన్నదాతలకు భరోసా కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

​ఎమ్మెల్యే చొరవతో నెరవేరిన చిరకాల కల....

సీలింగ్ భూములపై హక్కుల కోసం ఏళ్ల తరబడి పోరాడుతున్న పేదల గోడును అర్థం చేసుకుని, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేసిన స్థానిక తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌కు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ చిరకాల కలను సాకారం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.​ హోరెత్తిన సభా ప్రాంగణం. పట్టాల పంపిణీ కార్యక్రమానికి నూతనకల్ పరిసర గ్రామాల నుంచి రైతులు, మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 

ఏడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడి, కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) సహకారం, స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు గడిచిన మూడు సంవత్సరాల కటోర శ్రమతో, 3000 ఎకరాలు 2000 మంది లబ్ధిదారుల, చేతికి భూమి పట్టాలు అందడంతో, వారి మోములో ఆనందం వెల్లివిరిసింది. నాయకుల ప్రసంగాలు, పట్టాల పంపిణీ సమయంలో రైతుల హర్షధ్వానాలు, చప్పట్లతో సభా ప్రాంగణం మార్మోగింది. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్‌రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.