calender_icon.png 14 August, 2025 | 4:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభావిత గ్రామాల ప్రజలు అప్రమత్తం

14-08-2025 02:34:10 PM

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ 

నల్లగొండ టౌన్, (విజయక్రాంతి): నల్గొండ జిల్లాలో వర్షాల కారణంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదని, మూసి ప్రాజెక్టు  గేట్లు ఎత్తిన  కారణంగా జిల్లాలోని కేతేపల్లి, శాలిగౌరారం మండలాల్లోని  ప్రభావిత గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియజేశారు. భారీ వర్షాలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు,సంబంధిత జిల్లా అధికారులతో వీడియో కాన్ఫెరెన్సు నిర్వహించారు.ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలోని పరిస్థితులను జిల్లా కలెక్టర్ మంత్రికి తెలియజేస్తూ మూసి ప్రాజెక్ట్  15 గేట్లను ఎత్తివేసి నీటిని కిందికి వదలడం జరిగిందని దీనివల్ల భీమారం లో లెవెల్ కాజ్ వే బ్రిడ్జి పై నీరు పొంగి ప్రవహిస్తున్నందున అక్కడ ప్రజలు బ్రిడ్జిని దాటి వెళ్లే సాహసం చేయకుండా  బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాక్టర్లను అడ్డంగా ఏర్పాటు  చేశామని తెలిపారు. జిల్లాలో భారీ వర్షాలు లేని కారణంగా పాఠశాలలకు సెలవు ప్రకటించే విషయం పై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని,  వర్షాల దృష్ట్యా జిల్లా యంత్రాంగం మొత్తం  అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు. 

ఇందుకు రెవెన్యూ శాఖ మంత్రి(Minister Ponguleti Srinivasa Reddy)  స్పందిస్తూ నాగార్జునసాగర్ ఎడమ కాలువ నుండి కనిష్ట స్థాయిలో నీటిని విడుదల చేయాలని, ఒకే సారి ఎక్కువ మొత్తంలో నీటిని విడుదల  చేస్తే కాలువ తెగిపోయేందుకు  ఆస్కారం ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకుని నీటి నియంత్రణ  చేయాలని చెప్పారు. అంతకుముందు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ  గడచిన రెండు రోజుల్లో  కొన్ని ప్రాంతాల్లో అనుకున్న దానికంటే ఎక్కువ వర్షం కురిసిందని, ఈరోజు, తిరిగి ఈ నెల 15 న కొన్ని జిల్లాలలో భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షం వల్ల దెబ్బతిన్న ప్రాంతాలలో ప్రజలకు సహాయక చర్యలు చేపట్టాలని, ఇందుకుగాను ఎలాంటి నిధుల కొరతలేదని, ప్రతి జిల్లాకు కోటి రూపాయలు ఇవ్వడం జరిగిందని, ఎక్కడైనా వర్షాల వల్ల రోడ్లు, విద్యుత్తు వంటి వాటికి అంతరాయం కలిగితే తక్షణమే పునరుద్ధరించాలని, అంటువ్యాధులు వ్యాపించకుండా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని, అవసరమైనచోట ఎస్ డి ఆర్ ఎఫ్ ,ఎన్ డి ఆర్ ఎఫ్ టీములు సిద్ధం చేసుకోవాలని, వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులు గురికాకుండా చూడాలని,లో లెవల్ కాజ్ వే ల వద్ద పోలీసు, ఇతర సిబ్బందిని ఆప్రమత్తంగా ఉంచాలని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్,సంబంధిత జిల్లా అధికారులు ఈ వీడియో కాన్ఫెరెన్స్ కు హాజరయ్యారు.