14-08-2025 02:38:23 PM
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి రాకూడదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy ) సూచించారు. రానున్న రెండు, మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిందన్నారు. ప్రజలు ఈ రెండు మూడు రోజులు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు సూచించారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు దివిటి పల్లి నుండి ఎదిర మధ్య దివిటిపల్లి రైల్వే స్టేషన్ వద్దగల చెరువులోని నీరు రోడ్డు పైన పొంగిపొర్లడంతో రోడ్డు కుంగిపోవడం వలన రెండు డివిజన్ల మధ్య రాకపోకలు ఆగిపోయాయి, ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే కి సమాచారం ఇవ్వడం తో ఆయన వెంటనే దివిటి పల్లి చేరుకోని దివిటి పల్లి, ఎదిర డివిజన్ ల మధ్య కుంగిపోయిన రోడ్డు ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్, ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి రాకపోకలు సాగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు.
రైల్వే అండర్ పాస్ రిటైనింగ్ వాల్ ను పరిశీలించిన ఎమ్మెల్యే
రాత్రి కురిసిన వర్షాలకు అప్పన్నపల్లి అండర్ పాస్ రైల్వే బ్రిడ్జి, రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో దానిని పరిశీలించారు. రైల్వే అధికారులతో మాట్లాడారు. రెండు రోజుల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణపు పనులను ప్రారంభిస్తామని వారు తెలిపారు. అనంతరం అమర రాజా బ్యాటరీ కంపెనీ వద్ద బస్సు బోల్తా పడి ఎస్వీఎస్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రామిరెడ్డి తో మాట్లాడి బాధితులు త్వరగా కోలుకునేలా వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సౌకర్యార్థం కంట్రోల్ రూం ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు కార్యకర్తలు అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూస్తామని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారే పల్లి సురేందర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ నాయకులు మాజీ కౌన్సిలర్ రామాంజనేయులు, అంజద్, అనుప ఆంజనేయులు, సిరిగిరి మురళీధర్, కోస్గి శివప్రసాద్ రెడ్డి, జేసిఆర్, రామకృష్ణ, మెట్టుకాడి ప్రభాకర్, చర్ల శ్రీనివాసులు, తుప్పలి ఆంజనేయులు, చిన్న, తదితరులు పాల్గొన్నారు.