13-07-2024 02:39:14 PM
కొత్తగా 1000 బస్సులుకొన్నాం.. మరో 1500 బస్సులకు ఆర్డర్ ఇచ్చాం
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో కొత్త బస్సులను మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ శనివారం ప్రారంభించారు. నల్గొండ-హైదరాబాద్ మధ్య నాన్ స్టాప్ ఏసీ, 3డీలక్స్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ... రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుతున్నామని పేర్కొన్నారు. కొత్తగా 1000 బస్సులు కొన్నాం, మరో 1500 బస్సులు ఆర్డర్ ఇచ్చామని మంత్రి పొన్నం వెల్లడించారు. దసరాలోపు నల్గొండ జిల్లాకు 30 ఎక్స్ ప్రెస్, 30 లగ్జరీ బస్సులు ఇస్తామని పొన్నం ప్రకటించారు.
ఆర్టీసీ ఉద్యోగులు సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు 21 శాతం డీఏ ఇచ్చామని చెప్పారు. రూ. 280 కోట్ల బకాయిల్లో రూ. 80 కోట్లు చెల్లించాం, మిగిలిన రూ. 20 కోట్లను నెలాఖరులోకా చెల్లిస్తామన్నారు. ఆర్టీసీలో 3035 ఉద్యోగ నియామకాలు చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గం కేంద్రం నుంచి లగ్జరీ బస్సులు నడుపుతామని వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు ప్రారంభిస్తామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి మాట్లాడుతూ... చెప్పినట్లే మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో నల్గొండ జిల్లాకు మరిన్ని బస్సులు తెస్తామన్నారు. కొత్త బస్సుల్లో నల్గొండకు 100 కేటాయించాలని కోరుతున్నామని మంత్రి పేర్కొన్నారు.