calender_icon.png 18 June, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ రోడ్లకు మహర్దశ

17-06-2025 11:50:49 PM

లక్ష్యాలు నిర్దేశించుకుని అధికారులు పనులు చేయాలి..

విధానంలో 18,472 కి.మీ మేర గ్రామీణ రోడ్ల ఆధునీకరణ..

గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో మంత్రి సీతక్క..

హైదరాబాద్ (విజయక్రాంతి): గతంలో గ్రామీణ రోడ్లు అంటే చిన్నచూపు ఉండేదని, కానీ హామ్(హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) విధానం ద్వారా గ్రామీణ రోడ్లకు మహర్దశ పట్టనుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) తెలిపారు. హామ్ విధానంతో పట్టణ రోడ్లకు దీటుగా పల్లె రోడ్లు మెరవనున్నాయని, ఈ ప్రాజెక్టుకు సంబంధించి మార్గదర్శకాలతో నేడో రేపో జీవో విడుదల చేస్తామన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి శాఖల వారీగా జరుగుతున్న పనుల పురోగతిపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో హామ్ విధానాన్ని అవలంబిస్తున్నారని, మహారాష్ట్ర, కర్ణాటకలకు అధికారుల బృందాలను పంపించి ఆ రెండు రాష్ట్రాల అనుభవాలను అధ్యయనం చేసి హామ్ విధానాన్నీ మన రాష్ట్రంలో పకడ్బందీగా అమలుచేస్తామన్నారు.

హామ్ విధానం ద్వారా మొత్తం 18,472 కిలోమీటర్ల మేరా గ్రామీణ రహదారులను ఆధునీకరిస్తామని చెప్పారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పనుల జాతరను ప్రారంభిస్తామని, ఇప్పటికే రూ.1,800 కోట్ల పనులను మంజూరు చేశామని తెలిపారు. అధికారులు నెలవారీగా లక్ష్యాలు నిర్దేశించుకుని పనిచేయాలని ఆదేశించారు. మొదటి విడతలో 7,947 కిలోమీటర్లను ఆధునికరిస్తామని, 15 రోజుల్లో టెండర్లు వేసే విధంగా అధికారులు కార్యాచరణ రూపొందించాలన్నారు. ఎంపీడీవోల బదిలీల ఫైల్ సీఎం వద్ద ఉందని, ఎంపీడీవోలకు వాహనాల అలవెన్స్ ఫైల్ ఆర్థిక శాఖ వద్దకు చేరిందని, ఈ రెండు ఫైళ్లకు కొద్దిరోజుల్లో క్లియరెన్స్ వస్తోందని ఉద్యోగులకు మంత్రి హామీ ఇచ్చారు.