18-06-2025 12:00:00 AM
ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన బాధితుడి కుమారుడు
జగిత్యాల, జూన్ 17 (విజయక్రాంతి): ఉపాధి వేటలో గల్ఫ్ బాట పట్టి, అక్కడ డ్రైవర్లుగా పనిచేస్తున్న 9 మంది తెలంగాణ వాసులు ఓ కేసులో ఇరుక్కున్న విషయం వెలుగు చూసింది. బెహరాన్ దేశంలోని ఆల్ మోహయ్యద్ కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్న 9 మంది తెలంగాణవాసులను ఇంధన దుర్వినియోగం కేసులో ఇటీవల అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది.
వీరిలో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన బొమ్మిడి సుదర్శన్ అనే ప్రవాస భారతీయుడు కూడా ఉన్నాడు. ఆయనతో పాటూ మరో 8 మంది ఈ నెల 4న అరెస్ట్ అయ్యారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారికి న్యాయ సహాయం అందించాలని కోరుతూ బొమ్మిడి సుదర్శన్ కుమారుడు నితిన్ హైదరాబాద్ ప్రజాభవన్లోని ప్రవాసీ ప్రజావాణిలో ముఖ్యమంత్రి పేరిట మంగళవారం వినతి పత్రం సమర్పించారు.
ఈ మేరకు ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేశ్రెడ్డి, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్రెడ్డి, బొజ్జ అమరేందర్రెడ్డిలను కలిసిన నితిన్ తన తండ్రితో పాటూ మిగతా 8 మందిని బెహరాన్ జైలు నుంచి విడిపించాలని కోరారు. కాగా ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు చేపట్టేలా చూస్తామని వారు భరోసా ఇచ్చారు.