13-06-2025 08:26:28 PM
ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు...
రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యం
పెద్దపల్లి జిల్లాలో ఎలిగేడులో పోలీస్ స్టేషన్ ను ప్రారంభోత్సవంలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు
పెద్దపల్లి, ఎలిగేడు,(విజయక్రాంతి): గత పాలకులు నాశనం చేసిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగు చేస్తూ అదే సమయంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి పొంగులేటి, రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ సుధా చైర్మన్ కే నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రావులతో కలిసి ఎలిగేడు మండలంలో నూతన పోలీస్ స్టేషన్ ను శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ మండల ఏర్పాటుకు కృషిచేసిన నాయకులు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాతే ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చిందన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్టాల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేసే నాయకుడు పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారని మంత్రి అభినందించారు. ఎన్నికల సమయంలో కొంతమంది నాయకులు అకస్మాత్తుగా ప్రజలలోకి వస్తారని, ఓడిపోయిన గెలిచిన కనిపించరని మీ ఎమ్మెల్యే మాత్రం ఓడిపోయిన సమయంలో కూడా పూర్తిస్థాయిలో ప్రజలలో ఉన్నారని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ప్రజలలో ఉంటూ పని చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గత పాలకులు విచిన్నం చేసినప్పటికీ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. గత పాలకుల సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అదనంగా నూతనంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజా ప్రభుత్వం చేపట్టిందన్నారు. గత పాలకులు తీసుకుని వచ్చిన ధరణి చట్టం వల్ల కేవలం పాలకుల కుటుంబ సభ్యులు మాత్రమే లబ్ది పొందారని, అనేక మంది రైతులకు కన్నీళ్లు మిగిల్చిన ధరణి చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేసి భూ సమస్యల పరిష్కారానికి అద్భుతమైన భూ భారతి చట్టం ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.
ప్రతి రెవెన్యూ గ్రామానికి అధికారులు వచ్చి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని, ప్రజల నుంచి భూ సమస్యల గురించి దరఖాస్తులు తీసుకొని క్షేత్రస్థాయిలోనే వాటిని పరిష్కరిస్తారని, మహిళలకు ఆర్టీసీ ఫ్రీ బాస్, పేదలకు సన్న బియ్యం పంపిణీ, 22 వేల 500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు అందుతుందని, రాబోయే 4 సంవత్సరాల కాలంలో సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను కట్టాలని ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
సామాన్య ప్రజల కష్టాలు పరిష్కరించేందుకే పోలీస్ స్టేషన్ ఏర్పాటు: మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు
సామాన్య ప్రజల కష్టాలు పరిష్కరించేందుకే పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దుళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మండలం ఏర్పాటు చేసిన 24 సంవత్సరాల తర్వాత స్థానిక ఎమ్మెల్యే కృషి ఫలితంగా నేడు పోలీస్ స్టేషన్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి హామీ మేరకు అత్యాధునిక సదుపాయాలతో ఎలిగేడు మండలంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నామని, సామాన్య ప్రజలకు కష్టాలను పరిష్కరించే దిశగా పోలీస్ అధికారులు నేడు విధులు నిర్వహిస్తున్నారని, గ్రామ స్థాయి నుంచి పక్కాగా శాంతి భద్రతలు నిర్వహించేలా పోలీస్ వ్యవస్థ పని చేస్తుందని మంత్రి తెలిపారు. పోలీస్ స్టేషన్ కు చాలా తక్కువ మంది రావాలని, ప్రజలు శాంతియుతంగా ఉండాలన్నారు.
ప్రభుత్వం ఎక్కడ ఆసుపత్రులను నిర్మించినా కూడా ప్రారంభోత్సవ సమయంలో ప్రాంత ప్రజలకు తక్కువ రోగాలు రావాలని, ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన చికిత్స అందాలని కోరుకుంటామని అదే విధంగా పోలీస్ స్టేషన్ కు రావాల్సిన పరిస్థితి ఎవరికి రావద్దని, తమ సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలను సొంత చుట్టాలు వస్తే ఏ విధంగా పరిష్కరిస్తామో ఆ విధంగా పోలీస్ సిబ్బంది పరిష్కరించాలని మంత్రి సూచించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలిగేడు మండలానికి అత్యధిక సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. నిరుపేదలను స్పష్టంగా గుర్తించి వారికి సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు.
జిల్లా కలెక్టర్ అభినందించిన మంత్రి
ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సదుపాయాలను వసతులను ప్రజా ప్రభుత్వం మెరుగుపర్చిందని, మన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సతీమణి ఇటీవల గోదావరిఖని జనరల్ ఆసుపత్రి లో ప్రసవించిందని ప్రభుత్వ ఆసుపత్రి ను ఉపయోగించే ప్రజలలో భరోసా కల్పించినందుకు మంత్రి జిల్లా కలెక్టర్ ను అభినందించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ, ఊమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 57వ మండలంగా 2001 సంవత్సరంలో ఎలిగేడు ఏర్పాటు కావడం జరిగిందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలిగేడు పోలీస్ స్టేషన్ హామి గత పాలకులు నిర్లక్ష్యం చేసిందని, ప్రజా పాలన వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు నాయకత్వంలో ముఖ్యమంత్రి ఒప్పించి నేడు ఎలిగేడు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నామని, ఉమ్మడి రాష్ట్రంలోనే మండల ఆఫీసు, తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటు చేశామని, ప్రస్తుతం ప్రజా పాలనలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని తెలిపారు.
ఎలిగేడు మండల ప్రజల కోసం రాబోయే విద్యా సంవత్సరం నాటికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ మాట్లాడుతూ మన కమిషనరేట్ పరిధిలో నాలుగు నూతన పోలీస్ స్టేషన్ లను ఒకే రోజు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, స్థానిక ఎమ్మెల్యే మంత్రి వర్యుల కృషి ఫలితంగా ఇది సాధ్యమైందన్నారు. ఎలిగేడు మండలంలో 12 గ్రామ పంచాయతీల పరిధిలో గల 20వేల జనాభాకు ఉపయోగపడేలా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశామని, 20 కిలోమీటర్ల ఏరియా పరిధిలో పోలీస్ స్టేషన్ నడిపించుకు నేందుకు అవసరమైన పోలీస్ సిబ్బంది ఎస్ఐ సిఐలను కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో డిసిపి కరుణాకర్, ఏసిపి కృష్ణ, అదనపు కలెక్టర్లు డి.వేణు, జే.అరుణశ్రీ, రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్ , ప్రజా ప్రతినిదులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.