20 April, 2026 | 1:44 AM

మధ్యవర్తుల్లేకుండా నేరుగా విక్రయం

20-04-2026 12:00 AM

మక్కలకు న్యాయమైన ధరలు అందేలా చర్యలు

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 

జడ్చర్ల (మిడ్జిల్), ఏప్రిల్ 19: ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా మక్కలు విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన మక్కలకు సరైన ధర అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మధ్యవర్తుల ఇబ్బందులు లేకుండా రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి విక్రయించుకోవాలని సూచించారు. రైతులకు మద్దతుగా ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను కొనసాగిస్తామని తెలిపారు.

రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అడిగిన వెంటనే కొనుగోలు కేంద్రం మంజూరు చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గకి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సభ్యులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.